నకిరేకల్,:
వర్షాకాలం ప్రారంభమవుతున్న నేపథ్యంలో నకిరేకల్ పట్టణంలోని నాలాలు ఆక్రమణలకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని, నాలాల్లో పేరుకుపోయిన చెత్తను ఎప్పటికప్పుడు తొలగించి పట్టణాన్ని వరద ముప్పు నుంచి రక్షించాలని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దైద రవీందర్ అధికారులకు సూచించారు.
నకిరేకల్ పట్టణంలోని 17, 18, 19, 20 వార్డులకు సంబంధించి ముత్యాలమ్మ గుడి సమీపంలో నిర్వహించిన ‘ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, ప్రజల సంక్షేమం, గ్రామాలు–పట్టణాల అభివృద్ధి, పారదర్శక పరిపాలన లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమం అభినందనీయమన్నారు.
ఈ కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వాటికి త్వరితగతిన పరిష్కారాలు అందించే అవకాశం కలుగుతోందని చెప్పారు. గ్రామాలు, పట్టణాల అభివృద్ధికి ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు.
విద్య, వైద్యం, తాగునీరు, రహదారులు, ఉపాధి వంటి రంగాల్లో మరింత పురోగతి సాధించేందుకు అందరూ సహకరించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి అర్హుడికి చేరేలా కృషి చేయడం అందరి బాధ్యత అని పేర్కొన్నారు.
ప్రజల సూచనలు, అవసరాలు, సమస్యలను పరిగణనలోకి తీసుకుని అభివృద్ధి ప్రణాళికలు రూపొందించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని నాలాలను వెంటనే శుభ్రపరచడంతో పాటు ఆక్రమణలను అరికట్టాలని అధికారులను కోరారు. ముందస్తు చర్యలతో నకిరేకల్ మున్సిపాలిటీని వరద ముప్పు నుంచి రక్షించవచ్చని, ప్రాంత అభివృద్ధికి అందరూ భాగస్వాములు కావాలని దైద రవీందర్ అన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి