"రోడ్లు.. నీళ్లు.. విద్య.. నల్గొండకు వేల కోట్ల వరాలు" తెలంగాణలోనే నంబర్-1 జిల్లాగా తీర్చిదిద్దడమే కోమటిరెడ్డి లక్ష్యం
"రోడ్లు.. నీళ్లు.. విద్య.. నల్గొండకు వేల కోట్ల వరాలు" తెలంగాణలోనే నంబర్-1 జిల్లాగా తీర్చిదిద్దడమే కోమటిరెడ్డి లక్ష్యం
సీనియర్ జర్నలిస్ట్ డి.డి.దాసు
"తగ్గేదేలే... నల్గొండలో అభివృద్ధి జాతర!"
రూ.13 వేల కోట్ల రోడ్లు.. రూ.125 కోట్ల వాటర్ ప్లాంట్.. మైనార్టీలకు ప్రత్యేక వరాలు
నల్గొండ జిల్లాలో అభివృద్ధి జాతరకు తెరలేచింది. రోడ్లు, తాగునీరు, విద్య, మైనార్టీ సంక్షేమం, గృహ నిర్మాణం వంటి పలు రంగాలకు సంబంధించి ఒకేరోజు భారీ స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడంతో జిల్లాలో ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది. "తగ్గేదేలే.. నల్గొండలో అభివృద్ధి జాతర మొదలైంది" అంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించారు.
తెలంగాణ చరిత్రలోనే అతిపెద్ద రహదారుల అభివృద్ధి కార్యక్రమంగా భావిస్తున్న రూ.13 వేల కోట్ల హ్యామ్ (HAM) రోడ్ల ప్రాజెక్టుకు కనగల్ వేదికగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఘనంగా శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 6,300 కిలోమీటర్ల రహదారులు డబుల్ రోడ్లుగా మారనున్నాయి. గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణ ప్రాంతాలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి.
దర్వేశిపురం-గుర్రంపోడు-కొండమల్లేపల్లి-డిండి మార్గానికి రూ.300 కోట్ల భారీ ప్రాజెక్టును ప్రకటించగా, చిట్యాల-రామన్నపేట-వలిగొండ-భువనగిరి-జగదేవ్పూర్ రూట్కు మరో రూ.300 కోట్ల రహదారి అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు వెల్లడించారు. అదేవిధంగా ఆలేరు నియోజకవర్గానికి కూడా రూ.300 కోట్ల రోడ్ల అభివృద్ధి ప్యాకేజీని కేటాయించారు.
జూన్ 17న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నల్గొండ జిల్లాలో పర్యటించనున్నట్లు మంత్రి వెల్లడించారు. కనగల్లో నిర్వహించే ముఖ్యమంత్రి సభను తెలంగాణలో గత రెండున్నరేళ్లలోనే అతిపెద్ద బహిరంగ సభగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు.
రోడ్ల అభివృద్ధితో పాటు తాగునీటి సమస్యల పరిష్కారంపై కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించినట్లు మంత్రి పేర్కొన్నారు. నల్గొండ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించేందుకు రూ.125 కోట్లతో ఆధునిక వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే నల్గొండ పట్టణంతో పాటు పరిసర ప్రాంతాలకు కూడా తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించే అవకాశం ఉందని చెప్పారు.
మైనార్టీ సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్న మంత్రి, మాన్యంచెల్కలో రూ.44 లక్షలతో ఉర్దూ మీడియం ప్రాథమిక పాఠశాల భవనానికి శంకుస్థాపన చేశారు. అవసరమైతే రూ.1 కోటి వరకు వ్యయం చేసి ఆ పాఠశాలను ఆదర్శ విద్యాసంస్థగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. చిన్నారులకు ఆధునిక విద్యను అందించాలనే లక్ష్యంతో కంప్యూటర్ విద్యతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) శిక్షణను కూడా అందించే విధంగా ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.
ముస్లిం మైనార్టీల సామాజిక అవసరాల దృష్ట్యా రూ.10 కోట్ల వ్యయంతో ఆధునిక షాదీఖానా నిర్మాణం చేపట్టనున్నట్లు మంత్రి ప్రకటించారు. అదేవిధంగా పేద ముస్లిం కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడంతో పాటు అవసరమైతే ఇంటి స్థలం, ఇల్లు రెండూ కల్పిస్తామని భరోసా ఇచ్చారు.డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణాలను పరిశీలించిన మంత్రి, జూలై నెలలో లబ్ధిదారులు గృహప్రవేశాలు చేసుకునేలా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
నల్గొండను తెలంగాణలోనే అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలబెట్టడమే తమ లక్ష్యమని స్పష్టం చేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అభివృద్ధి కార్యక్రమాల అమలులో ఎలాంటి రాజీ ఉండదని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ దశలవారీగా అమలు చేస్తూ నల్గొండను రాష్ట్రంలో నంబర్-1 జిల్లాగా తీర్చిదిద్దుతామని ఆయన స్పష్టం చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి