కరెంట్ ట్రాన్స్ఫార్మర్ల దొంగల ముఠా అరెస్టు.!
కరెంట్ ట్రాన్స్ఫార్మర్ల దొంగల ముఠా అరెస్టు.!
NM Yadav
బర్మా శరణార్థుల నిర్వాకం ఐదుగురు రోహింగ్యాల అరెస్ట్..
నల్గొండ జిల్లా పోలీసుల భారీ ఆపరేషన్..
12 దొంగతనాలు గుర్తింపు రూ.7.71 లక్షల నగదు, బైక్లు స్వాధీనం..
నల్గొండ : రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వరుసగా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేస్తూ, వాటిలోని కాపర్ వైరు, విలువైన ఆయిల్ను తస్కరిస్తున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను నల్గొండ జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. పక్కా సమాచారంతో నార్కట్పల్లి పోలీసులు బుధవారం జరిపిన వాహన తనిఖీల్లో ఈ ఐదుగురు సభ్యుల రోహింగ్యా ముఠా పట్టుబడింది. నల్గొండ డీఎస్పీ కె. శివరాం రెడ్డి గురువారం మీడియాకు వెల్లడించిన వివరాల ప్రకారం..
జీవనోపాధి కోసం వచ్చి జల్సాల వైపు!
బర్మా (మయన్మార్) దేశానికి చెందిన హమీద్ హుస్సేన్, జహంగీర్ ఆలం, నూర్ కాసిం, నూరుల్ అమీన్, నూరుల్ ఆలం @ మహబూబ్ ఆలం అనే ఐదుగురు వ్యక్తులు సుమారు 12 ఏళ్ల క్రితం శరణార్థులుగా భారతదేశానికి వచ్చారు. మొదట్లో దిల్లీలో తలదాచుకున్న వీరు ఆ తర్వాత హైదరాబాద్కు వలస వచ్చి బాలాపూర్, హఫీజ్బాబా నగర్ ప్రాంతాల్లో స్థిరపడ్డారు. నిత్యం కూలీ పనులకు వెళ్లే వీరంతా మద్యం అలవాటుతో స్నేహితులుగా మారారు. అయితే, కూలీ పనుల ద్వారా వచ్చే ఆదాయం వారి జల్సాలకు సరిపోకపోవడంతో సులువుగా డబ్బు సంపాదించేందుకు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను లక్ష్యంగా చేసుకున్నారు.
అర్ధరాత్రి వేళ ఆటోల్లో వచ్చి..
ముఠా సభ్యులంతా పగటిపూట బైక్లపై తిరుగుతూ శివారు ప్రాంతాల్లో మూసివేసిన ఫ్యాక్టరీలు, పొలాల్లోని ట్రాన్స్ఫార్మర్లను రేకీ చేసేవారు. అర్ధరాత్రి సమయాల్లో అద్దె ఆటోలను మాట్లాడుకుని, కట్టర్లు, పానాలు (స్పానర్లు), హ్యాండ్ గ్లౌజెస్తో అక్కడికి చేరుకునేవారు. విద్యుత్ సరఫరాను నిలిపివేసి, నిమిషాల వ్యవధిలో ట్రాన్స్ఫార్మర్లను కట్ చేసి అందులోని కాపర్ వైరింగ్, కాయిల్స్, ఆయిల్ను తస్కరించేవారు. దొంగిలించిన సొమ్మును హైదరాబాద్లోని గుజరీ వ్యాపారులకు అమ్మి సొమ్మును సమానంగా పంచుకునేవారు.
ఒకే కేసు దర్యాప్తులో 12 నేరాలు వెలుగులోకి..
గత ఏడాది డిసెంబరు 17న నార్కట్పల్లిలోని కళ్యాణి స్టీల్ లిమిటెడ్ కంపెనీలో భారీ దొంగతనం జరిగింది. కంపెనీకి చెందిన 220 కేవీ ట్రాన్స్ఫార్మర్ నుంచి ఏకంగా 21 వేల లీటర్ల ఆయిల్, కాపర్ కాయిల్స్, ఇతర విలువైన భాగాలను ఈ ముఠా అపహరించింది. దీనిపై అడ్మిన్ ఇన్ఛార్జ్ నెళ్లుట్ల చందు కుమార్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐ పి ఎస్ ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన ప్రత్యేక బృందాలు బుధవారం మధ్యాహ్నం నార్కట్పల్లి శివారులోని జాతీయ రహదారి (NH-65) పై రెడ్డయ్య ఫ్యాక్టరీ సమీపంలో నిఘా పెట్టారు. మూడు బైక్లపై అనుమానాస్పదంగా వస్తున్న ఐదుగురిని ఆపి విచారించగా అసలు విషయం వెలుగుచూసింది. ఈ ముఠా నార్కట్పల్లితో పాటు మాడ్గులపల్లి, చిట్యాల, వేములపల్లి, వాడపల్లి, పోచంపల్లి, యాదగిరిగుట్ట, రామన్నపేట, భువనగిరి రూరల్ పోలీస్ స్టేషన్ల పరిధిలో మొత్తం 12 దొంగతనాలకు పాల్పడినట్లు అంగీకరించారు.
రికవరీ మరియు రిమాండ్..
నిందితుల నుంచి రూ. 7,71,000 నగదు, రెండు లక్షల విలువైన 3 మోటార్ సైకిళ్లు, దొంగతనానికి ఉపయోగించిన కట్టర్లు, పానాలు, గ్లౌజులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కోర్టులో ప్రవేశపెట్టి రిమాండ్కు తరలిస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. అత్యంత చాకచక్యంగా వ్యవహరించి ఈ అంతర్రాష్ట్ర ముఠాను అదుపులోకి తీసుకున్న సీసీఎస్ ఇన్స్పెక్టర్ జితేందర్ రెడ్డి, నార్కట్పల్లి సీఐ నాగరాజు, ఎస్ఐలు సతీష్ వర్మ, విష్ణుమూర్తి, హెడ్ కానిస్టేబుళ్లు విష్ణువర్ధన్ గిరి, పుష్పగిరి, వహీద్ పాషా, కానిస్టేబుళ్లు అస్రార్, శివరాజ్, నరేష్, జునేద్, కమల్ కిషోర్లను జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ప్రత్యేకంగా అభినందించి రివార్డులను ప్రకటించారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి