15 రోజుల్లో ఆరోగ్య సంస్థల నమోదులు పూర్తి చేయాలి ఏబీడీఎం అమలుపై కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశాలు
15 రోజుల్లో ఆరోగ్య సంస్థల నమోదులు పూర్తి చేయాలి ఏబీడీఎం అమలుపై కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశాలు
Editor Desk
భువనగిరి,: జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆరోగ్య సంస్థలు, వైద్య సిబ్బంది హెల్త్ ఫెసిలిటీ రిజిస్ట్రీ (HFR), హెల్త్ ప్రొఫెషనల్ రిజిస్ట్రీ (HPR) నమోదులను వచ్చే 15 రోజుల్లో 100 శాతం పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు.
మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ (ABDM) మోడల్ డిస్ట్రిక్ట్ కార్యక్రమం అమలును సమీక్షించిన కలెక్టర్.. భువనగిరి, చౌటుప్పల్ పట్టణాల్లో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి నమోదులను వేగవంతం చేయాలని సూచించారు.
మహిళల్లో రక్తహీనత నివారణకు చేపట్టనున్న అనీమియా ట్రాకింగ్ ఫర్ ఉమెన్ కార్యక్రమానికి అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని, గ్రామస్థాయిలో ప్రత్యేక శిబిరాలు నిర్వహించి విస్తృత స్థాయిలో పరీక్షలు చేపట్టాలని ఆదేశించారు.
ఆగస్టు రెండో వారంలో జరగనున్న ఎన్క్యూఏఎస్ (NQAS) బృందం పర్యటన దృష్ట్యా ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యత ప్రమాణాలను మెరుగుపరచాలని సూచించారు. గర్భిణుల నమోదు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంపు, క్షయవ్యాధి గుర్తింపు, ఎన్సీడీ స్క్రీనింగ్, ఆర్బీఎస్కే కార్యక్రమాల పురోగతిని సమీక్షించారు.
వర్షాకాలంలో డెంగ్యూ, దోమల ద్వారా వ్యాపించే వ్యాధుల నివారణకు ప్రతి శుక్రవారం డ్రైడే కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించాలని ఆదేశించారు. అలాగే ఆరోగ్య శాఖ పరిధిలో కొనసాగుతున్న సివిల్ పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.
సమావేశంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డా. ఎం. మనోహర్, జిల్లా ఆసుపత్రుల సూపరింటెండెంట్లు, వైద్యాధికారులు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి