చెరువుగట్టు క్షేత్రంలో ఉద్రిక్తత.. కుండల వ్యాపారుల ఘర్షణ
చెరువుగట్టు క్షేత్రంలో ఉద్రిక్తత.. కుండల వ్యాపారుల ఘర్షణ
Komidala Mahender reddy
నార్కట్పల్లి, నల్లగొండ జిల్లా:
ప్రసిద్ధ చెరువుగట్టు శ్రీ పార్వతి జడలు రామలింగేశ్వర స్వామి దేవస్థానం పరిసరాల్లోని ఎల్లమ్మ గుడి వద్ద కుండల విక్రయాల వంతుల విషయంలో తలెత్తిన వివాదం తీవ్ర ఘర్షణకు దారితీసింది. సంవత్సరాలుగా కొనసాగుతున్న వంతుల పంపిణీ వివాదం మరోసారి భగ్గుమనడంతో ఇరు వర్గాలు పరస్పరం కత్తులతో దాడులకు దిగిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.
దేవస్థానానికి వచ్చే భక్తులకు కుండలు విక్రయించడం, బోనాలు సమర్పించడం ద్వారా జీవనం సాగిస్తున్న కుమ్మరి కులానికి చెందిన కుటుంబాల మధ్య వంతుల కేటాయింపుపై గత కొంతకాలంగా విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా చెలరేగిన వాగ్వాదం అదుపుతప్పి ఘర్షణగా మారింది.
ఘర్షణలో ఒక మహిళ చేతి వేళ్లు తెగిపోగా, పలువురు గాయపడినట్లు సమాచారం. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటన సమయంలో ఎల్లమ్మ గుడి పరిసరాల్లో భయాందోళనకర వాతావరణం నెలకొనగా, భక్తులు పరుగులు తీశారు.
కాగా, ఎల్లమ్మ గుడి వద్ద కుండల విక్రయాల వంతుల అంశంపై తరచూ వివాదాలు చోటుచేసుకుంటున్నాయని స్థానికులు చెబుతున్నారు. గతంలో కూడా ఇలాంటి ఘర్షణలు జరగడంతో దేవస్థానం అధికారులు, ఈవో జోక్యం చేసుకుని చర్యలు చేపట్టినప్పటికీ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించలేదని పేర్కొంటున్నారు.
తాజా ఘటనతో భక్తుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. పవిత్ర క్షేత్రంలో పదేపదే ఇలాంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం పట్ల స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వంతుల వ్యవస్థపై స్పష్టమైన విధానాన్ని అమలు చేసి వివాదాలకు చెక్ పెట్టాలని కోరుతున్నారు.
ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఇరు వర్గాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిసింది. ఘర్షణకు దారితీసిన అసలు కారణాలు, బాధ్యుల పాత్రపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి