మూడు నెలలుగా కల్లాల్లోనే ధాన్యం.. రైతుల గోడు. దుబ్బాక, పల్లివాడ కొనుగోలు కేంద్రాల ను సందర్శించిన మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
మూడు నెలలుగా కల్లాల్లోనే ధాన్యం.. రైతుల గోడు. దుబ్బాక, పల్లివాడ కొనుగోలు కేంద్రాల ను సందర్శించిన మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
Editor Desk
రామన్నపేట: మండలంలోని దుబ్బాక, పల్లివాడ గ్రామాల ధాన్యం కొనుగోలు కేంద్రాలను నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆదివారం సందర్శించారు. కేంద్రాల వద్ద రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతులు, ముఖ్యంగా మహిళా రైతులు తమ గోడును ఆయన దృష్టికి తీసుకెళ్లారు.
మార్కెట్ కల్లాల్లో ధాన్యం పోసి మూడు నెలలు దాటినా కొనుగోళ్లు పూర్తికాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితి చూడలేదని, ధాన్యం కొనుగోళ్లలో తీవ్ర జాప్యం వల్ల ఆర్థికంగా నష్టపోతున్నామని తెలిపారు. వర్షాలు కురుస్తుండటంతో ధాన్యం తడిసి నాణ్యత కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్ల విషయంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కుప్పలుగా పేరుకుపోయినా ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. రైతులు వడ్డీలు, కూలీల ఖర్చులు, రవాణా భారంతో నష్టపోతున్నారని పేర్కొన్నారు. రైతు సంక్షేమం గురించి గొప్పలు చెప్పే ప్రభుత్వం నేడు రైతులను గాలికి వదిలేసిందని ఆరోపించారు.
వర్షాల కారణంగా ధాన్యం దెబ్బతింటే అందుకు ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి రైతుల ఖాతాల్లో సకాలంలో నగదు జమ చేయాలని కోరారు. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి రైతుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో స్థానిక బీఆర్ఎస్ నాయకులు, రైతులు, మహిళా రైతులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి