దేశం కోసం యువతరం కదలాలి. మోదీ ప్రభుత్వంలో ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నం: సీపీఎం నేతల విమర్శలు
దేశం కోసం యువతరం కదలాలి. మోదీ ప్రభుత్వంలో ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నం: సీపీఎం నేతల విమర్శలు
Editor Desk
ఎల్బీనగర్, దేశాభివృద్ధిలో యువత కీలక పాత్ర పోషించాలని, పెట్టుబడిదారుల ఆధిపత్యం నుంచి దేశాన్ని విముక్తి చేయడానికి యువత ముందుకు రావాలని సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాన్ వెస్లీ పిలుపునిచ్చారు. కొత్తపేటలోని బీజేఆర్ భవన్లో మంగళవారం నిర్వహించిన యువ కమ్యూనిస్టుల సమ్మేళనంలో ఆయన మాట్లాడారు.
సమ్మేళనంలో సీపీఎం రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి, పొలిట్బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు మాట్లాడుతూ.. మోదీ ప్రభుత్వం దేశ ఆర్థిక వ్యవస్థను కార్పొరేట్ శక్తుల చేతుల్లో పెట్టిందని ఆరోపించారు. దేశ ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేరును హైదరాబాద్లోని ఓ రోడ్డుకు పెట్టడం సిగ్గుచేటని విమర్శించారు.
రాజ్యసభ సభ్యుడు రహీం మాట్లాడుతూ.. బీజేపీ పాలనలో నిరుద్యోగం, ద్రవ్యోల్బణం పెరిగాయని, గ్రామీణ ప్రాంతాలకు ఊతమిచ్చే ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేశారని ఆరోపించారు. దేశ ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా మారిందన్నారు.
జాన్ వెస్లీ మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను సీపీఎం నిరంతరం ప్రశ్నిస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. రైతు సమస్యలు, ధాన్యం కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.
సమసమాజ స్థాపన కోసం యువత రాజకీయాల్లోకి రావాలని, సీపీఎం బలోపేతానికి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో తమ్మినేని వీరభద్రం, జూలకంటి రంగారెడ్డి, చంద్రమోహన్, తొట రమేశ్, పగడాల యాదయ్య, కట్ట శ్రీనివాస్, కీసరి నర్సిరెడ్డి తదితరులతో పాటు డీవైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ నాయకులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి