పెరుగుతున్న ధరలకు అనుగుణంగా పవర్లూమ్ కార్మికుల కూలి రేట్లు పెంచాలి..
పెరుగుతున్న ధరలకు అనుగుణంగా పవర్లూమ్ కార్మికుల కూలి రేట్లు పెంచాలి..
సీనియర్ జర్నలిస్ట్ డి.డి.దాసు
నిలిచిపోయిన త్రిఫ్ట్ ఫండ్ పథకాన్ని వెంటనే పునఃప్రారంభించాలి: తెలంగాణ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్
పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా పవర్లూమ్ కార్మికుల కూలి రేట్లను తక్షణమే పెంచాలని, ఎనిమిది నెలలుగా నిలిచిపోయిన త్రిఫ్ట్ ఫండ్ (పొదుపు) పథకాన్ని వెంటనే పునఃప్రారంభించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎండీ సలీం, తెలంగాణ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
సోమవారం నల్లగొండ పట్టణంలోని పద్మనగర్ పద్మశాలి ఫంక్షన్ హాల్లో తెలంగాణ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ జనరల్ బాడీ సమావేశం జిల్లా అధ్యక్షుడు గంజి నాగరాజు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పవర్లూమ్ రంగంలో పనిచేస్తున్న కార్మికులు అనేక సమస్యలతో సతమతమవుతున్నారని, వారి సమస్యల పరిష్కారం కోసం ఐక్య పోరాటాలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పవర్లూమ్ రంగాన్ని పరిరక్షించే విధానాలను అమలు చేయాలని, కార్మికుల ఉపాధి భద్రతకు తగిన చర్యలు చేపట్టాలని కోరారు. కార్మికుల ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్న నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న త్రిఫ్ట్ ఫండ్ పథకాన్ని ఎనిమిది నెలలుగా నిలిపివేయడం వల్ల వేలాది మంది కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వెంటనే ఆ పథకాన్ని పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని కోరారు.
పద్మనగర్ ప్రాంతంలో నివసిస్తున్న పవర్లూమ్ కార్మికులకు కమ్యూనిటీ హాల్ అత్యవసర అవసరంగా మారిందని నాయకులు పేర్కొన్నారు. ముఖ్యంగా కార్మికుల కుటుంబాల్లో మరణాలు సంభవించినప్పుడు సరైన వసతులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పద్మనగర్లో కమ్యూనిటీ హాల్ నిర్మించాలని గతంలో జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హామీ ఇచ్చారని, కార్పొరేటర్ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఇదే అంశంపై హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
పవర్లూమ్ కార్మికుల హక్కుల పరిరక్షణ, సంక్షేమ పథకాల అమలు, పరిశ్రమ అభివృద్ధి కోసం సంఘటిత ఉద్యమాలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. కార్మికులందరూ 2026 సంవత్సరానికి సంబంధించిన యూనియన్ సభ్యత్వాలను త్వరితగతిన పూర్తి చేసుకోవాలని పిలుపునిచ్చారు. అలాగే కూలి రేట్ల పెంపు కోసం యాజమాన్యాలకు నోటీసులు జారీ చేసి, ఉద్యమ కార్యక్రమాలను మరింత విస్తృతంగా చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు.
కార్మికులు ఐక్యంగా ముందుకు సాగితేనే తమ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని నాయకులు పేర్కొన్నారు. పవర్లూమ్ పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించి కార్మికుల జీవనోపాధికి భరోసా కల్పించాలని కోరారు.
జిల్లా అధ్యక్షుడు గంజి నాగరాజు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సీఐటీయూ పట్టణ కన్వీనర్ అవుట రవీందర్, జిల్లా కమిటీ సభ్యులు గంజి రాజేష్, సీనియర్ నాయకులు పెండెం రాములు, ఇండస్ట్రియల్ ఏరియా అధ్యక్షుడు పెండెం బుచ్చిరాములు, పద్మనగర్, ఇండస్ట్రియల్ ఏరియా, చర్లపల్లి ప్రాంతాలకు చెందిన మహిళా కార్మికులు, నాయకులు సురపల్లి భద్రయ్య, ఎల్గం అంజనేయులు, దేవులపల్లి గిరిబాబు, నిమ్మలగోటి సైదులు, పొట్టబోతుల యాదగిరి, మూడ చంద్రకళ, మిరియాల శ్రీవాణి, సావిత్రమ్మ, యాదమ్మ తదితరులు పాల్గొన్నారు.
పవర్లూమ్ కార్మికుల సమస్యల పరిష్కారం, కూలి రేట్ల పెంపు, సంక్షేమ పథకాల పునరుద్ధరణ కోసం రానున్న రోజుల్లో ఉద్యమాలను మరింత ఉధృతం చేయనున్నట్లు తెలంగాణ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ నాయకులు స్పష్టం చేశారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి