యూట్యూబ్లో చూసి నకిలీ నోట్ల ముద్రణ దంపతుల అరెస్టు..
యూట్యూబ్లో చూసి నకిలీ నోట్ల ముద్రణ దంపతుల అరెస్టు..
NM Yadav
చండూర్లో పట్టుబడ్డ కిలాడీ ముఠా..
రూ.500 నకిలీ నోట్లు, ప్రింటర్, బైక్ స్వాధీనం
నిందితుడిపై రెండు రాష్ట్రాల్లో 7 నకిలీ నోట్ల కేసులు రౌడీషీట్..
నల్లగొండ : యూట్యూబ్ చూసి నకిలీ కరెన్సీ నోట్లను ముద్రిస్తూ వాటిని మార్కెట్లో చలామణి చేస్తున్న భార్యాభర్తలను నల్లగొండ జిల్లా చండూర్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.500 నకిలీ నోట్లు, ప్రింటర్, బైక్ తదితర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. నల్లగొండ డిఎస్పీ కె. శివరాం రెడ్డి సోమవారం వివరాలను వెల్లడించారు.
పాల కేంద్రం వద్ద దొరికిపోయాడు..
నల్లగొండకు చెందిన బెజవాడ రాజీవ్ @ రాజు ప్రైవేట్ ఉద్యోగి. ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కేందుకు సులభంగా డబ్బు సంపాదించాలని భావించాడు. ఇందుకోసం నకిలీ నోట్ల ముద్రణను ఎంచుకున్నాడు. భార్య దుర్గం పావనితో కలిసి యూట్యూబ్లో వీడియోలు చూసి నకిలీ నోట్ల తయారీని నేర్చుకున్నాడు. ఆన్లైన్లో హెచ్పీ ప్రింటర్, బాండ్ పేపర్లను కొనుగోలు చేసి నల్లగొండలోని తమ ఫ్లాట్లో నోట్లను ముద్రించడం ప్రారంభించాడు. వృద్ధులు ఉండే దుకాణాలు, రద్దీగా ఉండే సంతలను లక్ష్యంగా చేసుకుని ఈ నోట్లను చలామణి చేసేవాడు. ఈ క్రమంలో ఈ నెల 12న చండూర్ పట్టణంలోని శ్రీ మాధురి మిల్క్ సెంటర్ వద్ద ఆవుల కిరణ్ అనే వ్యక్తి వద్ద పాల ప్యాకెట్ కొనుగోలు చేసి రూ.500 నకిలీ నోటు ఇచ్చాడు. ఆ నోటుపై అనుమానం వచ్చిన కిరణ్ చండూర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
నిందితుల అరెస్ట్ సామాగ్రి స్వాదినం.
జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన ప్రత్యేక బృందం.. సోమవారం ఉదయం నల్లగొండ మిర్యాలగూడ రోడ్డులోని కంచర్ల టవర్స్ ఫ్లాట్ నెం. 506లో నిందితులను పట్టుకున్నారు. వారి వద్ద నుంచి,15 నకిలీ రూ.500 నోట్లు, నంబర్ లేని పల్సర్ బైక్, హెచ్పీ ప్రింటర్ & స్కానర్,100 జేకే ఎక్సెల్ బాండ్ పేపర్లు, కత్తెర, స్కేళ్లు, స్పార్కెల్ పెన్నులను స్వాధీనం చేసుకున్నారు. ఈ నకిలీ నోట్ల చలామణి వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందని తెలిసినప్పటికీ, కేవలం విలాసాలు, ఆర్థిక ఇబ్బందుల కోసమే ఈ నేరానికి పాల్పడినట్లు నిందితులు విచారణలో ఒప్పుకున్నారు అని డీఎస్పీ శివరాం రెడ్డి తెలిపారు.
పాత నేరస్థుడే రౌడీషీట్ కూడా ఉంది..
ప్రధాన నిందితుడు బెజవాడ రాజీవ్కు పెద్ద నేర చరిత్రే ఉంది. ఇతనిపై గతంలో ఒక హత్య కేసు, ఒక హత్యాయత్నం కేసు నమోదయ్యాయి. అంతేకాకుండా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని మహబూబాబాద్, తొర్రూర్, కరీంనగర్, గోదావరిఖని, జనగాం, అద్దంకి, సుబేదారి పోలీస్ స్టేషన్ల పరిధిలో మొత్తం 7 నకిలీ నోట్ల చలామణి కేసులు ఉన్నాయి. మిర్యాలగూడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఇతనిపై రౌడీషీట్ కూడా ఉందని పోలీసులు తెలిపారు. కేసును త్వరితగతిన ఛేదించిన చండూర్ సీఐ టి. రాము, ఎస్ఐ జె. శివకుమార్, ఏఎస్ఐ శ్రీరాములు, పీసీలు ఆనంద్ రెడ్డి, శివరాం కృష్ణ, నరేందర్, ఉపేందర్లను జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ప్రత్యేకంగా అభినందించారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి