అంజనాపురిలో పోలీసుల మెరుపు తనిఖీలు
అంజనాపురిలో పోలీసుల మెరుపు తనిఖీలు
Biksham
26 బైకులు, 6 కార్లు స్వాధీనం – వలస కూలీల వివరాల సేకరణ
జిల్లాలో నేర నియంత్రణతో పాటు ప్రజల్లో భద్రతా భావం పెంపొందించే లక్ష్యంతో సూర్యాపేట రూరల్ పోలీసులు అంజనాపురి, మానసనగర్ కాలనీల్లో సోమవారం తెల్లవారుజామున మెరుపు తనిఖీలు నిర్వహించారు.
జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ ఆదేశాల మేరకు సూర్యాపేట డివిజన్ డీఎస్పీ ప్రసన్న కుమార్, రూరల్ సీఐ రాజశేఖర్, ఎస్ఐ బాలు నాయక్ ఆధ్వర్యంలో సుమారు 80 మంది పోలీసు సిబ్బంది తనిఖీల్లో పాల్గొన్నారు. కాలనీలోని ప్రతి ఇంటిని, అక్కడ నివసిస్తున్న ప్రతి వ్యక్తిని క్షుణ్ణంగా పరిశీలించారు.
ప్రత్యేకంగా రాజస్థాన్, మహారాష్ట్ర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ నివసిస్తున్న వలస కూలీల వివరాలను సేకరించి వారి నేపథ్యాన్ని పరిశీలించారు. సరైన ధృవీకరణ పత్రాలు లేని 26 ద్విచక్ర వాహనాలు, 6 కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ సందర్భంగా డీఎస్పీ ప్రసన్న కుమార్ మాట్లాడుతూ, సమాజంలో భద్రతను మరింత బలోపేతం చేయడం, పోలీసులపై ప్రజల విశ్వాసం పెంచడమే ఈ తనిఖీల ప్రధాన ఉద్దేశమని తెలిపారు.
ప్రజలు సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, తెలియని లింకులు క్లిక్ చేయవద్దని, బ్యాంకింగ్ వివరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ పంచుకోవద్దని సూచించారు. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, అసాంఘిక కార్యకలాపాలపై సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు.
వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని సూచించారు. కొత్త వ్యక్తులకు ఇండ్లు అద్దెకు ఇచ్చే ముందు గుర్తింపు కార్డులు తప్పనిసరిగా తనిఖీ చేయాలని తెలిపారు.
కాలనీల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే రక్షణ వలయం ఏర్పడి నేరాల నియంత్రణకు దోహదపడుతుందని, అనుమానాస్పద కదలికలు కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని డీఎస్పీ ప్రజలను కోరారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి