బాధ్యులపై చర్యలు తీసుకుని కుటుంబాన్ని ఆదుకోవాలి: సీఐటీయూ జిల్లా నాయకుడు మద్దాల ప్రభాకరరావు
ఎర్రుపాలెం, ఆగస్టు 6: గ్రామపంచాయతీ కార్మికులకు ప్రభుత్వం కల్పించిన జీవిత బీమా పథకం అమలులో అధికారుల నిర్లక్ష్యం కారణంగా మృతి చెందిన పారిశుద్ధ్య కార్మికుడి కుటుంబం ఆర్థిక భరోసాను కోల్పోయిందని సీఐటీయూ జిల్లా నాయకుడు మద్దాల ప్రభాకరరావు ఆరోపించారు. ఈ ఘటనకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవడంతో పాటు, బాధిత కుటుంబానికి ప్రభుత్వం ప్రత్యేక ఆర్థిక సహాయం అందించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఎర్రుపాలెం మండలంలోని బనిగండ్లపాడు గ్రామపంచాయతీలో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేస్తున్న బలుసుపాటి ప్రసాద్ మృతి చెందిన విషయం తెలుసుకున్న ప్రభాకరరావు, సీఐటీయూ నాయకులు, పంచాయతీ కార్మికులతో కలిసి మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామపంచాయతీ కార్మికులకు పంచాయతీ నిధుల నుంచి జీవిత బీమా ప్రీమియం చెల్లించాలని ప్రభుత్వం స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ, సంబంధిత అధికారులు వాటిని అమలు చేయడంలో నిర్లక్ష్యం వహించారని విమర్శించారు. ప్రీమియం చెల్లించకపోవడం వల్ల మృతి చెందిన కార్మికుడి కుటుంబానికి అందాల్సిన బీమా ప్రయోజనం అందకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
కార్మికుల కుటుంబాలకు రక్షణ కల్పించాల్సిన అధికారులే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే బాధిత కుటుంబాలు తీవ్రంగా నష్టపోతాయని పేర్కొన్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవడంతో పాటు, మృతి చెందిన కార్మికుడి కుటుంబానికి ప్రభుత్వం తక్షణ ఆర్థిక సహాయం అందించాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో సీఐటీయూ మండల కో-కన్వీనర్ దూదిగం బసవయ్య, పంచాయతీ కార్మికులు గంతాల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి