నల్గొండ జిల్లా చిట్యాల పట్టణంలోని శివగంగా స్విమ్మింగ్ పూల్ నిర్వాహకుల నిర్లక్ష్యం కారణంగా ఒక యువకుడు మృతి చెందిన ఘటనలో నల్గొండ జిల్లా వినియోగదారుల ఫోరం ఏభై రెండు లక్షల పదకొండు వేల రూపాయలు పరిహారం చెల్లించాలని సంచలన తీర్పునిచ్చింది. చిట్యాల మండలం వట్టిమర్రి గ్రామానికి చెందిన నూనే శ్రవణ్కుమార్, 2024 ఏప్రిల్ 15న తన స్నేహితులతో కలసి చిట్యాల శివారులో ఉన్న శివగంగా స్విమ్మింగ్ పూల్కు వెళ్లాడు. స్విమ్మింగ్ పూల్లో ఈత కొడుతున్న సమయంలో శ్రవణ్కుమార్కు తలకు తీవ్ర గాయమై నీటిలో మునిగిపోయాడు. గమనించిన స్నేహితులు వెంటనే అతడిని బయటకు తీసి నార్కట్పల్లిలోని కామినేని ఆసుపత్రికి తరలించగా, పరీక్షించిన వైద్యులు అతడు అప్పటికే మృతి చెందినట్లు ధృవీకరించారు. ఈ దుర్ఘటనపై మృతుడి తండ్రి నూనే సంజీవ చిట్యాల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. స్విమ్మింగ్ పూల్ నిర్వాహకులు ఎటువంటి భద్రతా చర్యలు పాటించలేదని, వారి నిర్లక్ష్యం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని విచారణలో తేలింది. బాధిత కుటుంబం న్యాయం కోసం నల్గొండ జిల్లా వినియోగదారుల కమిషన్ను ఆశ్రయించింది. న్యాయవాదులు శేపూరి మధుసూదన్, ఎస్. పూర్ణచందర్లు బాధిత కుటుంబం తరఫున రూ. 50,00,000/- పరిహారం ఇప్పించాలని వాదనలు వినిపించారు.
ఇరుపక్షాల వాదనలు విన్న వినియోగదారుల ఫోరం చైర్పర్సన్ శ్రీ మామిడి క్రిస్టోఫర్, సభ్యులు సంధ్యారాణి, వెంకటేశ్వర్లు.. స్విమ్మింగ్ పూల్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్పష్టం చేశారు. మృతుడి కుటుంబానికి నష్టపరిహారంగా రూ. 52,11,000/- లను 45 రోజులలోపు చెల్లించాలని స్విమ్మింగ్ పూల్ నిర్వాహకులను ఆదేశిస్తూ తీర్పు వెలువరించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి