ఓటీపీ, బ్యాంకు వివరాలు గోప్యంగా ఉంచాలి..
సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930కు ఫిర్యాదు చేయాలి
సైబర్ నేరాలు రోజురోజుకూ కొత్త రూపాల్లో పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు, ముఖ్యంగా యువత అప్రమత్తంగా ఉండాలని నాగోల్ పోలీస్ స్టేషన్ సీఐ మహమ్మద్ మక్బూల్ జానీ సూచించారు. సైబర్ జాగ్రూకత దివస్ సందర్భంగా నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రేయాస్ ఇంజినీరింగ్ కళాశాలలో బుధవారం నిర్వహించిన సైబర్ అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు సైబర్ భద్రతపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా సీఐ మహమ్మద్ మక్బూల్ జానీ మాట్లాడుతూ.. ఓటీపీ, బ్యాంకు ఖాతా వివరాలు, ఏటీఎం పిన్, సీవీవీ వంటి గోప్య సమాచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులతో పంచుకోవద్దని హెచ్చరించారు. సోషల్ మీడియా, ఆన్లైన్ షాపింగ్, పెట్టుబడులు, ఉద్యోగాల పేరుతో వచ్చే నకిలీ ఆఫర్లతో పాటు డిజిటల్ అరెస్ట్ పేరుతో జరుగుతున్న మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
సకాలంలో ఫిర్యాదు చేస్తే నష్టాన్ని నివారించే అవకాశం
సైబర్ మోసానికి గురైన వెంటనే 1930 జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్లైన్కు ఫోన్ చేయడంతో పాటు cybercrime.gov.inలో ఫిర్యాదు నమోదు చేయాలని సీఐ సూచించారు. సకాలంలో ఫిర్యాదు చేస్తే డబ్బు తిరిగి పొందే అవకాశాలతో పాటు బాధితులకు త్వరగా న్యాయం జరిగే అవకాశం ఉంటుందని తెలిపారు.
ప్రజల్లో సైబర్ భద్రతపై చైతన్యం పెంపొందించేందుకు ఇలాంటి అవగాహన కార్యక్రమాలను నిరంతరం నిర్వహిస్తామని సీఐ మహమ్మద్ మక్బూల్ జానీ స్పష్టం చేశారు.
కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ సి. ఉదయ్ కిరణ్, అధ్యాపకులు, పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. విద్యార్థులు సైబర్ నేరాల నివారణ, వ్యక్తిగత సమాచార భద్రత, ఆన్లైన్ మోసాల గుర్తింపు వంటి అంశాలపై అవగాహన పొందారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి