మెడికల్ కళాశాలకు ఆయన పేరు పెట్టాలి: డా. చీమ శ్రీనివాసరావు
వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలోని నల్లబెల్లి గ్రామానికి చెందిన మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ ఉద్యమ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి ఇటీవల గుండెపోటుతో మృతి చెందడంతో ఆయన కుటుంబ సభ్యులను ఉద్యమకారుల ఫోరం నాయకులు బుధవారం పరామర్శించారు.
ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు డా. చీమ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వరంగల్, ఖమ్మం, కరీంనగర్ జిల్లాలకు చెందిన ఉద్యమకారులు భారీ సంఖ్యలో తరలివచ్చి పెద్ది సుదర్శన్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో డా. చీమ శ్రీనివాసరావు మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమానికి విశేష సేవలందించిన గొప్ప నాయకుడిని కోల్పోయామని, ఆయన మరణం ఉద్యమకారులకు తీరని లోటని అన్నారు. నర్సంపేట నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన మెడికల్ కళాశాలకు పెద్ది సుదర్శన్ రెడ్డి పేరు పెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జోగు అంజన్న మాట్లాడుతూ, మలిదశ తెలంగాణ ఉద్యమంలో తీవ్ర గాయాలపాలై ఒక కన్ను కోల్పోయినా ఉద్యమాన్ని వీడకుండా రాష్ట్ర సాధన కోసం చివరి వరకు పోరాడిన యోధుడు పెద్ది సుదర్శన్ రెడ్డి అని కొనియాడారు. ఆయన కుటుంబానికి ఉద్యమకారుల ఫోరం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మహిళా అధ్యక్షురాలు పోతు జ్యోతి రెడ్డి, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు గుండు దయానంద్, మహిళా ఉపాధ్యక్షురాలు దుగ్యాని శ్యామల, గ్రేటర్ హైదరాబాద్ కన్వీనర్ జగన్, సీనియర్ నాయకులు కొండ స్వామి, భాస్కర్, రజనీకాంత్, జయ, మల్లమ్మ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి