సవరణ ప్రక్రియను పకడ్బందీగా పూర్తి చేయాలని అధికారులకు కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆదేశం
ఓటర్ల జాబితా సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియను ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పూర్తి చేసి, అర్హులైన ప్రతి ఒక్కరి పేరుతో పక్కా ఓటర్ల జాబితా సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అధికారులను ఆదేశించారు.బుధవారం సూర్యాపేట మండల కేంద్రంలో తహసీల్దార్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆర్డీవో, తహసీల్దార్లు, బీఎల్ఓ సూపర్వైజర్లు, బీఎల్ఓలతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎన్యూమరేషన్ ఫారాల సమర్పణ, డేటా నమోదు, క్షేత్రస్థాయి పరిశీలనపై అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రజల నుంచి అందిన ఫారాలను తప్పనిసరిగా క్షేత్రస్థాయిలో మరోసారి ధ్రువీకరించాలని సూచించారు. ముఖ్యంగా అందని ఫారాలు, ఇంట్లో లేని వారు, ఇతర ప్రాంతాలకు మారిన వారు, మరణించిన వారి వివరాలను పూర్తిస్థాయిలో నిర్ధారించాలని ఆదేశించారు. డూప్లికేట్ ఓట్లు లేదా ఒకే వ్యక్తికి సంబంధించిన వివరాలు ఒకటి కంటే ఎక్కువ చోట్ల నమోదైతే వెంటనే గుర్తించి సరిచేయాలని సూచించారు. సవరణ ప్రక్రియకు గడువు పొడిగించిన నేపథ్యంలో లభించిన సమయాన్ని సద్వినియోగం చేసుకొని ప్రతి అర్హుడి ఓటు నమోదు అయ్యేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
ఎలాంటి తప్పుల్లేని ఓటర్ల జాబితా తయారీలో బీఎల్ఓలు, సూపర్వైజర్ల బాధ్యత కీలకమని పేర్కొన్నారు. కలెక్టరేట్ అధికారులు మండలాల వారీగా డేటాను క్రాస్చెక్ చేస్తున్నారని వెల్లడించారు. ఎన్యూమరేషన్ ఫారంలో ఒకే చోట ఓటు నమోదు కోసం దరఖాస్తు చేస్తున్నట్లు ఇచ్చే ప్రకటనను కచ్చితంగా పరిశీలించాలని, కావాలనే డూప్లికేట్ ఫారాలు సమర్పించినా లేదా తప్పుడు వివరాలు ఇచ్చినా సంబంధిత వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఈ సమావేశంలో ఆర్డీవో వేణుమాధవరావు, తహసీల్దార్ సాయి గౌడ్, రెవెన్యూ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి