రైతుల పట్ల కాంగ్రెస్ సర్కార్ నేరపూరిత వైఖరి: మాజీ మంత్రి జగదీష్ రెడ్డి...
ఎండిన పంట పొలాల్లో రైతులతో కలసి బైఠాయింపు..
తెలకంటిగూడెంలో కంచర్ల భూపాల్ రెడ్డితో కలసి క్షేత్రస్థాయి పరిశీలన..
విద్యుత్ సబ్ స్టేషన్ సందర్శన, లాగ్ బుక్ తనిఖీ..
కనగల్ : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలు, నిర్లక్ష్య వైఖరి వల్లే సాగునీరు, ఉచిత విద్యుత్ అందక పంటలు పూర్తిగా ఎండిపోతున్నాయని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్గొండ జిల్లా కనగల్ మండలం తెలకంటిగూడెం గ్రామంలో ఎండిపోయిన వరి పొలాలను నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డితో కలసి ఆయన ఆదివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా బాధితులైన భైరగోని పెద్ద లింగయ్య, యాదయ్య అనే రైతులతో కలసి ఎండిన పొలంలోనే కూర్చొని ఆవేదనను అడిగి తెలుసుకున్నారు. పంట నష్టం, కరెంట్ కోతలు, కాలువల ద్వారా నీరు అందకపోవడంతో పడుతున్న ఇబ్బందులను రైతులు వారి దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం గ్రామంలోని విద్యుత్ సబ్ స్టేషన్ను సందర్శించిన జగదీష్ రెడ్డి, అక్కడ ఉన్న లాగ్ బుక్ను క్షుణ్ణంగా పరిశీలించి, కరెంట్ కోతలకు గల కారణాలపై సంబంధిత అధికారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా జగదీష్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనపై నిప్పులు చెరిగారు. కృష్ణా నదిలో పుష్కలంగా నీళ్లు అందుబాటులో ఉన్నప్పటికీ పంటలను ఎండబెట్టడం ప్రభుత్వ నేరపూరిత చర్య అని మండిపడ్డారు. నీళ్లు, కరెంట్ కష్టాల వల్ల రైతాంగం ఎదుర్కొంటున్న దుస్థితిపై సీఎం, మంత్రులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నీళ్లు వాడుకున్నామని అబద్ధాలు చెప్పిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రైతులకు ఏం జవాబు ఇస్తారని ప్రశ్నించారు. విద్యుత్ లేకపోవడానికి 'బొగ్గు కొరత' అని, నీళ్లు అందకపోవడానికి 'ఎల్నినో' అని కారణాలు చెప్పడం పచ్చి అబద్ధాలని కొట్టిపారేశారు.
కేసీఆర్ పాలనలోనే రైతులకు మేలు..
గతంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనూ రైతులు పంటలు సాగుచేసుకోలేక తీవ్ర ఇబ్బందులు పడ్డారని, కేసీఆర్ అధికారంలోకి వచ్చాకే పుష్కలంగా పంటలు పండించుకున్నామని రైతులు చెబుతున్నారని పేర్కొన్నారు. కేసీఆర్ హయాంలో 21 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచి, 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇచ్చామని, దానికి రైతులే ప్రత్యక్ష సాక్షులని గుర్తుచేశారు. అయితే ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ యాదాద్రి, భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లలో విద్యుత్ ఉత్పత్తి యూనిట్లను ఎందుకు బంద్ పెట్టిందో సమాధానం చెప్పాలన్నారు. ఒకరు నీళ్లు లేవని, మరొకరు బొగ్గు లేదని నెపం నెట్టేస్తూ విద్యుత్, నీటి సరఫరాను నిలిపివేసి రైతులను నిలువునా ముంచుతున్నారని ధ్వజమెత్తారు. మరోవైపు మిల్లర్లను భయపెట్టి మిల్లులను కూడా బంద్ చేయిస్తున్నారని ఆరోపించారు.
మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్, భట్టి సమాధానం చెప్పాలి..
ఎండిపోయిన పంటలను చూసి మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమాధానం చెప్పాలని జగదీష్ రెడ్డి డిమాండ్ చేశారు. రాజకీయాల కోసమే విమర్శలు చేస్తున్నామని మాట్లాడే నాయకులు ముందుగా పంటలు ఎండిన రైతుల వద్దకు వచ్చి వారి ఆవేదన వినాలని హితవు పలికారు. ఇందిరమ్మ రాజ్యం అంటే రైతులను ఇబ్బందులకు గురిచేయడమేనా అని ప్రశ్నించారు. ఓట్లేసి గెలిపించిన ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఎండిపోతున్న పంటలకు తక్షణమే సరిపడా సాగునీరు విడుదల చేయాలని, 24 గంటల ఉచిత విద్యుత్ను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతుల పక్షాన పెద్ద ఎత్తున పోరాటాలకు దిగుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ చీరా పంకజ్ యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షుడు రేగట్ట మల్లికార్జున్రెడ్డి, నల్గొండ మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి, మాజీ ఎంపీపీ ఎస్కే కరీం పాషా, గోన రవీందర్ రావు, నల్గొండ మాజీ జెడ్పిటిసి తుమ్మల లింగస్వామి, కనగల్, నల్గొండ మండల పార్టీ అధ్యక్షులు అయితగోని యాదయ్య, దేప వెంకటరెడ్డి, సింగిల్ విండో చైర్మన్ దోటి శ్రీనివాస్, కార్పొరేటర్లు మారగొని భవాని గణేష్, పెరికే యాదయ్య, దొడ్డి రమేష్, బాణావత్ దీప్లా, గోపగోని స్వాతి రాజశేఖర్, రావుల శ్రీనివాసరెడ్డి, రామగిరి శ్రీధర్ రావు, జొన్నలగడ్డ శేఖర్ రెడ్డి, బైరగోని వెంకన్న గౌడ్, సుంకి రెడ్డి వెంకట్ రెడ్డి, సర్పంచ్ కారింగు జానయ్య, గుండెబోయిన జంగయ్య రాము, మర్రి రేణుక, నర్రా నిర్మల, చెనగొని యాదగిరి, చెనగొని నాగరాజు తదితర బిఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి