కార్పొరేటీకరణతో రోజురోజుకూ కనుమరుగవుతున్న గ్రామీణ చేతివృత్తులను ప్రభుత్వం ఆధునీకరించి, తగిన ప్రోత్సాహం అందించి వృత్తిదారులను ఆదుకోవాలని చేతివృత్తిదారుల సమన్వయ కమిటీ రాష్ట్ర నాయకులు నారి ఐలయ్య డిమాండ్ చేశారు. ఆదివారం గంజి మురళి అధ్యక్షతన దొడ్డి కొమరయ్య భవన్లో నిర్వహించిన చేతివృత్తిదారుల జిల్లా సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఒకప్పుడు పల్లెలకు పట్టుగొమ్మలుగా ఉన్న చేతివృత్తులు మార్కెట్ దోపిడీ, మారుతున్న పరిస్థితులను తట్టుకోలేక కనుమరుగవుతున్నాయని ఐలయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి కోల్పోయిన వృత్తిదారులు జీవనోపాధి కోసం వలసలు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.
కల్లుగీత వృత్తిని ఆధునీకరించి, కల్లు ఉప ఉత్పత్తుల తయారీకి ఆర్థిక సహకారం అందించాలని కోరారు. గొర్రెలు, మేకల పెంపకందారుల కుటుంబాల్లోని నిరుద్యోగ యువతకు బ్యాంకు షరతులు లేకుండా ప్రభుత్వ షూరిటీతో గొర్రెల ఫారాలు ఏర్పాటు చేసి ఉపాధి కల్పించాలన్నారు. చేనేత కార్మికుల ఉత్పత్తులను ప్రభుత్వం కొనుగోలు చేయడంతో పాటు కార్పొరేషన్ ద్వారా ఆర్థిక సహకారం అందించాలని సూచించారు.
మత్స్యకారులకు చేప పిల్లలను మధ్యవర్తులు లేకుండా నేరుగా అందించాలని, మత్స్య సొసైటీల అభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరారు. రజక, నాయి బ్రాహ్మణులకు ప్రభుత్వం ప్రకటించిన ఉచిత విద్యుత్కు సంబంధించిన పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించి, విద్యుత్ అధికారుల ఒత్తిడి నుంచి వారిని కాపాడాలని విజ్ఞప్తి చేశారు. అన్ని చిన్నచిన్న చేతివృత్తులను ప్రోత్సహించి వాటి పరిరక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నారి ఐలయ్య కోరారు.
సమావేశంలో కల్లుగీత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి చౌగాని సీతారాములు, అధ్యక్షుడు కొండా వెంకన్న, గొర్రెలు–మేకల పెంపకందారుల సంఘం జిల్లా కార్యదర్శి అవిశెట్టి శంకరయ్య, దొంగరి వెంకన్న, నెలికంటి నరసింహ, చేనేత కార్మిక సంఘం అధ్యక్షుడు కందగట్ల గణేష్, రజక వృత్తిదారుల సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పొదిళ్ల శీను, చెరుకు పెద్దలు, మత్స్య కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ఇటికాల ఉపేందర్, జిల్లా ఉపాధ్యక్షుడు ఉప్పల గోపాలు, మొగుడు రాల వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి