విద్యార్థుల ఆత్మహత్యలు ఆందోళనకరం : బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు బుర్ర ఉపేంద్ర సాహు
ప్రభుత్వం ఎన్నికల హామీ మేరకు జాబ్ క్యాలెండర్ విడుదల చేయకపోవడంతో నిరుద్యోగ యువత తీవ్ర నిరాశకు గురవుతోందని, విద్యార్థులు ఆత్మహత్యలు, ఆత్మహత్యాయత్నాలకు పాల్పడుతున్న పరిస్థితి ఆందోళన కలిగిస్తోందని బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) ఖమ్మం జిల్లా అధ్యక్షుడు బుర్ర ఉపేంద్ర సాహు అన్నారు.ముదిగొండ మండలం న్యూ లక్ష్మీపురం గ్రామానికి చెందిన గడ్డం వేణుకుమార్ ఆత్మహత్యాయత్నం చేసి ప్రస్తుతం ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నేపథ్యంలో బీఎస్పీ నాయకులు బుధవారం ఆయనను పరామర్శించారు. అనంతరం ఉపేంద్ర సాహు మాట్లాడుతూ, ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడం వల్ల నిరుద్యోగులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని ఆరోపించారు.
ఎన్నికల సమయంలో ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చినా ఇప్పటివరకు అమలు చేయలేదని విమర్శించారు. మరోవైపు ఫీజు రీయింబర్స్మెంట్ సమస్యలు కూడా విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని పేర్కొన్నారు.ఆత్మహత్యాయత్నం చేసిన వేణుకుమార్కు ప్రభుత్వం మెరుగైన వైద్యసాయం అందించాల్సిన బాధ్యత ఉందని, నిరుద్యోగుల సమస్యలపై ప్రభుత్వం మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ఉద్యోగ నియామకాల ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు, నిరుద్యోగుల తరఫున బీఎస్పీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో బీఎస్పీ పార్లమెంట్ ఇన్చార్జి చెరుకుపల్లి నాగేశ్వరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి మిరియాల నాగరాజు, సీనియర్ నాయకులు పల్లెపోగు విజయకుమార్, మట్టే నాగేశ్వరరావు, దారెల్లి రమేష్, నల్లగట్టు శంకర్, వెన్నబోయిన రమేష్, ఏడుకొండలు, దాసరి రాజశేఖర్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి