ఉన్నత న్యాయస్థానం తీర్పును స్వాగతిస్తూ సూర్యాపేటలో సంబరాలు
అక్రిడిటేషన్ కమిటీలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల సమాఖ్యకు ప్రాతినిధ్యం కల్పించాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేయడాన్ని స్వాగతిస్తూ బుధవారం సూర్యాపేటలో సమాఖ్య ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు పాల్వాయి జానయ్య ఆధ్వర్యంలో టపాసులు కాల్చి, కేక్ కట్ చేసి ఆనందాన్ని పంచుకున్నారు.
ఈ సందర్భంగా పాల్వాయి జానయ్య మాట్లాడుతూ, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల సమాఖ్య వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య కృషి, న్యాయపోరాట ఫలితంగానే ఈ తీర్పు వచ్చిందని అన్నారు. జర్నలిస్టుల హక్కులు, సంక్షేమం కోసం సమాఖ్య ప్రారంభం నుంచి నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు.
గత ఏడాది నుంచి ఈ అంశం న్యాయస్థానం పరిధిలో కొనసాగిందని, కొందరు వ్యక్తులు స్వప్రయోజనాల కోసం సంఘాన్ని బలహీనపరిచే ప్రయత్నాలు చేసినప్పటికీ న్యాయం గెలిచిందన్నారు. 2012లో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల సమాఖ్య ఏర్పాటై రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తోందని పేర్కొన్నారు.
ఉన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అక్రిడిటేషన్ కమిటీల్లో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల సమాఖ్యకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలని ఆయన కోరారు. ఈ తీర్పు జర్నలిస్టుల హక్కుల సాధనలో కీలక ముందడుగని అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో జాతీయ మండలి సభ్యుడు శ్రీరాముల కృష్ణ, దృశ్య మాధ్యమాల జిల్లా కార్యదర్శి నందిపాటి సైదులు, జిల్లా ఉపాధ్యక్షులు ఎస్.కే. పాషా, బిక్షం గౌడ్, చివ్వేంల మండల అధ్యక్షుడు కొంగుల సతీష్, కార్యవర్గ సభ్యులు సందీప్, అనిల్ కుమార్, ఎస్.కే. ఆసిఫ్, గౌతం, శ్రీను, జంపయ్య, గోవర్ధన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి