7437 ఎస్సై, కానిస్టేబుల్ పోస్టుల్లో 300 ఉద్యోగాలు కేటాయించాలి: విశ్వవిద్యాలయాల దివ్యాంగుల ఫోరం డిమాండ్
హైదరాబాద్, ఆగస్టు 6: తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన 7,437 ఎస్సై, కానిస్టేబుల్ పోలీసు ఉద్యోగాల నియామకాల్లో వికలాంగుల హక్కుల చట్టం–2016 (RPwD Act–2016) ప్రకారం దివ్యాంగులకు 4 శాతం రిజర్వేషన్ను తప్పనిసరిగా అమలు చేయాలని విశ్వవిద్యాలయాల దివ్యాంగుల ఫోరం తెలంగాణ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది.
ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాలలో నిర్వహించిన సమావేశంలో ఫోరం నాయకులు మాట్లాడుతూ, మొత్తం 7,437 పోస్టుల్లో దివ్యాంగులకు సుమారు 300 పోస్టులను రోస్టర్ ప్రకారం కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు.
పోలీసు శాఖలో దివ్యాంగులకు అనువైన పోస్టులను శాస్త్రీయంగా గుర్తించి, చట్టబద్ధమైన రోస్టర్ను ప్రకటించాలని, అనువుకాని పోస్టులు ఉంటే వాటికి సంబంధించిన మినహాయింపు ఉత్తర్వులను స్పష్టంగా జారీ చేయాలని డిమాండ్ చేశారు. ఎలాంటి కారణాలు చూపకుండా దివ్యాంగులను నియామకాల నుంచి పూర్తిగా దూరంగా ఉంచడం రాజ్యాంగ స్ఫూర్తికి, వికలాంగుల హక్కుల చట్టానికి విరుద్ధమని పేర్కొన్నారు.
అందువల్ల తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ పోలీసు నియామక మండలి వెంటనే నియామక నోటిఫికేషన్ను పునఃసమీక్షించి, 4 శాతం రిజర్వేషన్ అమలు చేస్తూ పోస్టుల వారీగా రోస్టర్ను విడుదల చేయాలని, దివ్యాంగులకు సమాన ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. డిమాండ్లు నెరవేర్చకపోతే రాజ్యాంగబద్ధంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఈ సమావేశంలో కాంగ్రెస్ మేనిఫెస్టో అమలు సాధన సమితి చైర్మన్ చెరుకు నాగభూషణం, విశ్వవిద్యాలయాల దివ్యాంగుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఎన్. అశోక్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మారవేణి చంద్రశేఖర్ యాదవ్, జనరల్ సెక్రటరీ ఆంజనేయులు గౌడ్, మొరిగాడి నరసింహ గౌడ్, మొక్క ఉపేందర్, ధనమ్మ, జనమ్మ, కర్ణాకర్, వెంకటేష్, జగన్, వెంకట్ తదితర దివ్యాంగ విద్యార్థి నాయకులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి