35 ఏళ్లైనా బాధిత కుటుంబాలకు పూర్తి న్యాయం జరగలేదని ఆవేదన
చుండూరులో కులవివక్ష నేపథ్యంలో దళితులపై జరిగిన దారుణ ఘటనను మరువలేమని, బాధిత కుటుంబాలకు పూర్తి న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం నాయకులు పేర్కొన్నారు.
చుండూరు ఘటనకు 35 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా గురువారం గోదావరిఖనిలోని తెలంగాణ అంబేద్కర్ ట్రస్ట్ భవన్లో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో చుండూరు అమరవీరులకు ఘన నివాళులర్పించారు. పెద్దపెల్లి జిల్లా కో-కన్వీనర్ ఆకునూరి బాల అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో అమరవీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా బొంకూరి మధు, కొంకటి లక్ష్మణ్, మైస రాజేష్, కాంపెల్లి సతీష్, ఈదునూరి పద్మ మాట్లాడుతూ చుండూరు ఘటనలో కులదురహంకారంతో ఎనిమిది మంది దళితులను అత్యంత దారుణంగా హత్య చేశారని గుర్తు చేశారు. ఘటన జరిగి 35 సంవత్సరాలు గడిచినా బాధిత కుటుంబాలకు పూర్తి స్థాయిలో న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. చుండూరు అమరవీరులకు న్యాయం జరిగేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో బొచ్చు శంకర్, జనగామ రాజనర్సు, గద్దల శశిభూషణ్, బూడిద సమ్మయ్య, మేకల సురేష్, పుల్లూరి మహేందర్, పంజా అశోక్, కాంపెల్లి జీవన్ కుమార్, రామగిరి రమేష్, జిలకర రామస్వామి తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఈదునూరి పద్మ, జనగామ రాజనర్సు ఆలపించిన చుండూరు ఘటనకు సంబంధించిన పాటలు పలువురిని భావోద్వేగానికి గురిచేశాయి. కార్యక్రమంలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం, మున్సిపల్ కార్పొరేషన్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి