మోగనున్న బడిగంట… సమస్యల మధ్యే బడిబాట శిథిల భవనాలు..
మోగనున్న బడిగంట… సమస్యల మధ్యే బడిబాట శిథిల భవనాలు..
Biksham
ఉపాధ్యాయుల కొరత.. మౌలిక సదుపాయాల లేమితో సూర్యాపేట విద్యార్థుల అవస్థలు
సెలవులు ముగియడంతో జిల్లాలో నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. పుస్తకాలు, బ్యాగులతో విద్యార్థులు ఉత్సాహంగా బడిబాట పట్టినా, ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న సమస్యలు వారి ఆనందంపై నీళ్లు చల్లుతున్నాయి.
జిల్లాలో మొత్తం 1,294 పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 720 ప్రాథమిక, 186 ప్రాథమికోన్నత, 388 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. దాదాపు 70 వేల మంది విద్యార్థులు తరగతి గదుల్లోకి అడుగుపెట్టారు. అయితే వారిలో చాలా మంది శిథిలావస్థలో ఉన్న భవనాల్లోనే చదువుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.
జిల్లాలో సుమారు 400 పాఠశాల భవనాలు శిథిలావస్థలో ఉన్నట్లు సమాచారం. 86 ప్రాథమిక, 24 ప్రాథమికోన్నత, 75 ఉన్నత పాఠశాలల్లో గదులకు అత్యవసర మరమ్మతులు అవసరమయ్యాయి. అదనంగా 350 తరగతి గదులు అవసరం కాగా, ప్రస్తుతం 300 గదుల కొరత ఉంది.
1950–1955 మధ్య నిర్మించిన పాత భవనాలు ఇప్పటికీ వినియోగంలో ఉండటం ఆందోళన కలిగిస్తోంది. శిథిలమైన గదుల్లో విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ చదువులు కొనసాగిస్తున్నారు.
ఉపాధ్యాయుల కొరత కూడా జిల్లాలో తీవ్ర సమస్యగా మారింది. పలు మండలాల్లో సరిపడా బోధనా సిబ్బంది లేకపోవడంతో బోధన దెబ్బతింటోంది. 348 ప్రాథమిక, 76 ప్రాథమికోన్నత, 163 ఉన్నత పాఠశాలల్లో మరమ్మతుల పనులు పెండింగ్లో ఉన్నాయి.
చాలా పాఠశాలల్లో మరుగుదొడ్లు, మంచినీటి సౌకర్యాలు లేకపోవడంతో ముఖ్యంగా బాలికలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు జిల్లాలో అనేక పాఠశాలలు ఇన్చార్జి అధికారుల ఆధ్వర్యంలోనే కొనసాగుతున్నాయి.
పరీక్ష ఫలితాలు మెరుగుపడ్డాయని అధికారులు చెబుతున్నప్పటికీ, కనీస మౌలిక సదుపాయాలు లేకుండా నాణ్యమైన విద్య ఎలా సాధ్యమవుతుందని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు.
50 ఏళ్లు దాటిన భవనాలను కూల్చివేసి కొత్త భవనాలు నిర్మించాలని ప్రభుత్వ ఆదేశాలు ఉన్నప్పటికీ, జిల్లాలో అమలు నత్తనడకన సాగుతోంది. శిథిల భవనాల తొలగింపు, కొత్త గదుల నిర్మాణం, ఖాళీ ఉపాధ్యాయ పోస్టుల భర్తీపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని విద్యావేత్తలు కోరుతున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి