300 మంది వృద్ధులకు ఉచిత ఆశ్రయం.. వృద్ధాశ్రమ నిర్మాణానికి ఆర్. కృష్ణయ్య మద్దతు
300 మంది వృద్ధులకు ఉచిత ఆశ్రయం.. వృద్ధాశ్రమ నిర్మాణానికి ఆర్. కృష్ణయ్య మద్దతు
Editor Desk
వనస్థలిపురంలో 300 మంది నిరాధార వృద్ధులకు ఉచిత ఆశ్రయం కల్పించే లక్ష్యంతో రెడీ టు సర్వ్ ఫౌండేషన్ చేపట్టిన వృద్ధాశ్రమ నిర్మాణ కార్యక్రమానికి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ . కృష్ణయ్య మద్దతు ప్రకటించారు.
ఫౌండేషన్ నిర్వాహకులు పెద్ది శంకర్, రాకేష్ దత్తతో పాటు వాలంటీర్లు ఆదివారం ఆర్. కృష్ణయ్యను మర్యాదపూర్వకంగా కలిసి వృద్ధాశ్రమ నిర్మాణ ప్రాజెక్టు వివరాలను వివరించారు. సమాజంలో నిరాధార వృద్ధులకు సురక్షితమైన నివాసం, ఆహారం, వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ఆయన అభినందించారు. ఈ మహత్తర సేవా యజ్ఞానికి తన సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా ఫౌండేషన్ ప్రతినిధులు వృద్ధాశ్రమ నిర్మాణానికి ప్రజల సహకారం అవసరమని తెలిపారు. ఒక్కో చదరపు అడుగు నిర్మాణ వ్యయానికి రూ.3,500 చొప్పున విరాళాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలు అందించే ప్రతి చిన్న సహాయం వృద్ధుల జీవితాల్లో భరోసాను నింపుతుందని పేర్కొన్నారు.
సమాజంలోని ప్రతి ఒక్కరూ ఈ సేవా కార్యక్రమంలో భాగస్వాములు కావాలని ఫౌండేషన్ పిలుపునిచ్చింది. హైదరాబాద్లోని వనస్థలిపురంలో నిర్మించనున్న ఈ ఉచిత వృద్ధాశ్రమం 300 మంది వృద్ధులకు శాశ్వత ఆదరణ కేంద్రంగా నిలవనుందని నిర్వాహకులు తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి