20 ఏళ్ల సేవ... కానీ ఉద్యోగ భద్రత శూన్యం
20 ఏళ్ల సేవ... కానీ ఉద్యోగ భద్రత శూన్యం
Komidala Mahender reddy
ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ల ఆవేదన – మేనిఫెస్టో హామీ ఎక్కడ? ఒకే వ్యవస్థలో వివక్షపై మండిపాటు
గ్రామీణాభివృద్ధికి రెండు దశాబ్దాలుగా వెన్నెముకలా పనిచేస్తున్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్ఆర్ఈజీఎస్) ఫీల్డ్ అసిస్టెంట్లు ఇప్పటికీ ఉద్యోగ భద్రత కోసం ఎదురుచూడాల్సి వస్తోందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పథకం ప్రారంభం నుంచి గ్రామాల్లో అభివృద్ధి పనుల అమలులో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నప్పటికీ, తమను ప్రభుత్వం శాశ్వత ఉద్యోగులుగా గుర్తించకపోవడం అన్యాయమని వారు పేర్కొంటున్నారు. నల్గొండ జిల్లా ఫీల్డ్ అసిస్టెంట్ల యూనియన్ మాజీ అధ్యక్షుడు మర్రి రమేష్ మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో ఫీల్డ్ అసిస్టెంట్లను రెగ్యులర్ చేస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీ మూడు సంవత్సరాలు గడిచినా అమలుకు నోచుకోలేదని విమర్శించారు. ఒకే వ్యవస్థలో పనిచేస్తున్న ఐకేపీ సిబ్బందికి పే స్కేలు, ఇతర ఉద్యోగ ప్రయోజనాలు కల్పిస్తుండగా, ఫీల్డ్ అసిస్టెంట్లను మాత్రం తాత్కాలిక ఉద్యోగులుగానే కొనసాగించడం వివక్షకు నిదర్శనమని అన్నారు.
ప్రస్తుతం నెలకు కేవలం రూ.12,370 వేతనంతోనే సేవలు అందిస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లు, గ్రామపంచాయతీల్లో జరిగే హరితహారం, ఇందిరమ్మ ఇళ్లు, స్వచ్ఛ భారత్, మరుగుదొడ్ల నిర్మాణం, ఇంకుడు గుంతలు, వైకుంఠధామాలు, గ్రామ నర్సరీలు, మట్టి రోడ్లు, పశువుల పాకలు, జల సంచయ్–జల భగీరథ తదితర అభివృద్ధి కార్యక్రమాల అమలులో కీలక పాత్ర పోషిస్తున్నామని గుర్తు చేస్తున్నారు.ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతి సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమంలో భాగస్వాములమవుతున్నప్పటికీ తమ సేవలకు తగిన గుర్తింపు దక్కడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 20 ఏళ్ల సుదీర్ఘ సేవను పరిగణనలోకి తీసుకుని ఫీల్డ్ అసిస్టెంట్లను తక్షణమే రెగ్యులర్ చేయాలని, అప్పటి వరకు కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత, సంక్షేమ ప్రయోజనాలు కల్పించాలని ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు.
"గ్రామాభివృద్ధి కోసం జీవితాలను అంకితం చేశాం... కానీ మా భవిష్యత్తుపై మాత్రం ఇప్పటికీ అనిశ్చితి వీడలేదు" అని ఫీల్డ్ అసిస్టెంట్లు వేదన వ్యక్తం చేస్తున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి