వృద్ధులే లక్ష్యంగా దారిదోపిడీలు చేసే అంతర్ జిల్లా ఘరానా గ్యాంగ్ అరెస్ట్.!
వృద్ధులే లక్ష్యంగా దారిదోపిడీలు చేసే అంతర్ జిల్లా ఘరానా గ్యాంగ్ అరెస్ట్.!
NM Yadav
ఇద్దరు నిందితుల ముఠాను పట్టుకున్న సీసీఎస్, కట్టంగూర్ పోలీసులు..
రూ. 22 లక్షల విలువైన 75 గ్రాముల బంగారం, కారు, ఫోన్లు స్వాధీనం..
పాత నేరస్థుల వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్..
నల్లగొండ : జాతీయ రహదారులను ఆసరాగా చేసుకుని, ఒంటరిగా తిరిగే వృద్ధులు మరియు మహిళలను లక్ష్యంగా చేసుకుని వరుస రాబరీలు, చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్న అంతర్ జిల్లా దోపిడీ దొంగల ముఠా గుట్టును నల్లగొండ జిల్లా పోలీసులు రట్టు చేశారు. నల్లగొండ జిల్లా సీసీఎస్ పోలీసులు, కట్టంగూర్ పోలీసులు సంయుక్తంగా జరిపిన మెరుపు దాడిలో ఈ ఘరానా గ్యాంగ్కు చెందిన ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ (ఎస్పీ) శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ వెల్లడించారు.
బులెట్ బైక్ను అడ్డగించి చైన్ స్నాచింగ్..
ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం మరియు ఆంధ్రప్రదేశ్కు చెందిన ఈ ముఠా సభ్యులు గత కొంతకాలంగా నేషనల్ హైవే పరిధిలోని పోలీస్ స్టేషన్లలో తీవ్ర కలకలం రేపుతున్నారు. మార్చి 10వ తేదీ రాత్రి సుమారు 8:30 గంటల సమయంలో కట్టంగూర్ మండలానికి చెందిన అయితగొని సునీల్ తన స్నేహితుడితో కలిసి ముత్యాలమ్మగూడెం గ్రామ శివారులోని టిఫిన్ సెంటర్ వద్ద భోజనం ముగించుకుని తిరిగి తన బుల్లెట్ మోటార్ సైకిల్పై బయలుదేరాడు. కట్టంగూర్ గ్రామ సమీపంలో రోడ్డు పక్కన బైక్ ఆపి నిలుచున్న సమయంలో, హ్యుందాయ్ వెర్నా కారులో వచ్చిన ముగ్గురు దుండగులు ఒక్కసారిగా వారిపై దాడికి దిగారు. చంపేస్తామని తీవ్రంగా బెదిరించి సునీల్ మెడలో ఉన్న రెండు తులాల బంగారు గొలుసును బలవంతంగా లాక్కొని క్షణాల్లో కారులో పరారయ్యారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కట్టంగూర్ ఎస్సై రవీందర్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించగా, జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు నల్లగొండ డీఎస్పీ శివరాం రెడ్డి పర్యవేక్షణలో సీసీఎస్ ఇన్స్పెక్టర్ జితేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి.
సాంకేతిక పరిజ్ఞానంతో వేట సినిమా ఫక్కీలో అరెస్ట్..
మే 16న నల్లగొండ ఎక్స్ రోడ్డు వద్ద కట్టంగూరు పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా A-2 షేక్ చాంద్ పాషా కారుతో సహా పట్టుబడగా, పరారీలో ఉన్న ప్రధాన నిందితులు A-1 ధర్మతేజ, A-3 రంజాన్ వలీల కోసం పోలీసులు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి గాలింపు తీవ్రం చేశారు. ఈ క్రమంలో శుక్రవారం తెల్లవారుజామున 6 గంటల సమయంలో విజయవాడ - హైదరాబాద్ జాతీయ రహదారిపై వాహనాలు తనిఖీ చేస్తుండగా, ఒక లారీలో అనుమానాస్పదంగా ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నించారు. అలర్ట్ అయిన పోలీసులు వారిని వెంబడించి సినిమా ఫక్కీలో అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా పాత నేరాలన్నీ వెలుగులోకి వచ్చాయి. సుమారు రూ. 22 లక్షల విలువైన 75 గ్రాముల బంగారు ఆభరణాలు. నేరానికి ఉపయోగించిన హ్యుందాయ్ వెర్నా కారు (TS08-FX-1231)., రెండు సెల్ ఫోన్లను రికవరీ చేశారు. ఈ ముఠా నేరాలకు పాల్పడే విధానం అత్యంత ప్రమాదకరంగా ఉందని ఎస్పీ వివరించారు. వీరు ప్రధానంగా సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 9 గంటల మధ్య సమయాన్ని ఎంచుకుంటారు. జాతీయ రహదారుల వెంట ఒంటరిగా వెళ్లే వృద్ధులు, మహిళలు, బస్సు సౌకర్యం లేని మారుమూల ప్రాంతాల్లో నడుచుకుంటూ వెళ్లే ప్రయాణికులను గుర్తించి, వారిని బెదిరించి, కొట్టి ఆభరణాలను దోచుకోవడం వీరి శైలి. గత 5 సంవత్సరాలుగా ఖమ్మం, కోదాడ, సూర్యాపేట, చౌటుప్పల్ ప్రాంతాల్లో ఏకంగా 18 డకైటీలు, రాబరీ కేసుల్లో వీరు నిందితులుగా ఉన్నారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఎస్పీ శరత్ చంద్ర పవార్..
వేసవి కాలంలో గ్రామాల్లో దొంగలు, అంతర్ జిల్లా నేరస్థుల సంచారం పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా మహిళలు రాత్రి సమయాల్లో ఒంటరిగా భారీ బంగారు ఆభరణాలుధరించి బయటకు వెళ్లవద్దు. ఇళ్ల డాబాలపై నిద్రించే వారు నగలతో పడుకోవద్దు. ప్రతి గ్రామంలో ప్రజలు, వ్యాపారులు స్వచ్ఛందంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి. ఇది నేరాల నియంత్రణకు, నిందితులను త్వరగా పట్టుకోవడానికి ఎంతగానో దోహదపడుతుంది. కేసును అత్యంత ప్రతిభావంతంగా ఛేదించిన సీసీఎస్ సీఐ జితేందర్ రెడ్డి, సీఐ డి. చంద్రశేఖర్ రెడ్డి, శాలిగౌరారం ఇన్చార్జ్ సీఐ రాఘవరావు, కట్టంగూర్ ఎస్సై ఎం. రవీందర్, ఎస్సై డి. విజయ్ కుమార్, సీసీఎస్ హెడ్ కానిస్టేబుళ్లు విష్ణువర్ధనగిరి, నాగార్జున ప్రసాద్, పుష్పగిరి, వహీద్ పాషా, కానిస్టేబుళ్లు సాయి, శివరాజ్, జూనైద్, నరేశ్, నాగరాణి, కట్టంగూర్ పీఎస్ హెడ్ కానిస్టేబుల్ రామ్మోహన్, కానిస్టేబుల్ ముజీబ్లను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించి నగదు రివార్డులను ప్రకటించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి