ఐదు తరాల కలయిక.. దుబ్బాకలో ఆత్మీయతల సందడి
ఐదు తరాల కలయిక.. దుబ్బాకలో ఆత్మీయతల సందడి
Editor Desk
కుటుంబ బంధాలకు కొత్త ఊపిరి.. ఉమ్మడి కుటుంబ వ్యవస్థకు ఆదర్శంగా సమ్మేళనం
రామన్నపేట,
మారుతున్న కాలంతో ఉమ్మడి కుటుంబాల సంస్కృతి క్రమంగా కనుమరుగవుతున్న వేళ.. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం దుబ్బాక గ్రామంలో నిర్వహించిన గట్టు సాయమ్మ–ఈదయ్య కుటుంబ ఆత్మీయ సమ్మేళనం అందరికీ ఆదర్శంగా నిలిచింది. ఒకే కుటుంబానికి చెందిన ఐదు తరాల సభ్యులు ఒకే వేదికపై కలుసుకుని ఆప్యాయతలు పంచుకోవడం అరుదైన ఘట్టంగా మారింది.
సాంకేతిక యుగ ప్రభావంతో కుటుంబ సభ్యుల మధ్య దూరాలు పెరుగుతున్న తరుణంలో పెద్దలు, యువత, చిన్నారులు కలిసి పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ సందడి చేశారు. కుటుంబ మూలాలు, పూర్వీకుల సంప్రదాయాలు, పరస్పర గౌరవం, కుటుంబ విలువల గురించి పెద్దలు యువతకు వివరించడం కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
చిన్నతరం పెద్దల ఆశీర్వాదాలు పొందగా.. పెద్దతరం తమ వారసులను చూసి ఆనంద భాష్పాలు పెట్టుకున్నారు. కుటుంబ సభ్యులందరూ కలిసి భోజనాలు చేయడం, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం, మృతి చెందిన కుటుంబ సభ్యుల జ్ఞాపకార్థం ప్రదర్శించిన భావోద్వేగ వీడియో హాజరైన వారిని కంటతడి పెట్టించింది.
ఉన్నత ఉద్యోగులు, వైద్యులు, ఐటీ రంగ ఉద్యోగులు, వ్యాపారులు, ప్రజాప్రతినిధులుగా ఉన్న కుటుంబ సభ్యులందరూ ఒకే చోట చేరడం విశేషంగా నిలిచింది. సమాజంలో పెరుగుతున్న స్వార్థ ధోరణుల మధ్య ఇలాంటి కుటుంబ సమ్మేళనాలు మానవ సంబంధాలకు కొత్త ఊపిరి పోస్తాయని గ్రామ పెద్దలు అభిప్రాయపడ్డారు.
భారతీయ కుటుంబ వ్యవస్థ గొప్పతనాన్ని ప్రతిబింబించిన ఈ సమ్మేళనం మరెన్నో కుటుంబాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని పలువురు పేర్కొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి