మహిళా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి
మహిళా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి
Krishna
మహిళల సంక్షేమం, ఆర్థిక స్వావలంబన కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యతతో పనిచేస్తోందని టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి తెలిపారు. మంగళవారం సంగారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో మహిళా సంఘాల సభ్యులకు చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళా సంఘాల బలోపేతానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఇప్పటివరకు మహిళా సంఘాల సభ్యులకు రూ.2 కోట్ల మేర వడ్డీ లేని రుణాలను అందించినట్లు తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాలనలో మహిళా సంఘాలను నిర్లక్ష్యం చేసిందని, వడ్డీ లేని రుణాలు సక్రమంగా ఇవ్వలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు పారదర్శకంగా రుణాలు అందిస్తూ స్వయం ఉపాధికి ప్రోత్సాహం ఇస్తోందన్నారు.ఇందిరా శక్తి పథకం కింద ఇప్పటికే 119 మందికి రుణాలు మంజూరు చేసినట్లు తెలిపారు.అలాగే సంగారెడ్డి పట్టణంలో 212 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసినట్లు పేర్కొన్నారు.గత ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పేరుతో అనర్హులకు కేటాయింపులు చేసిందని ఆరోపించారు. ప్రస్తుతం ప్రజా ప్రభుత్వం అర్హులైన ప్రతి పేద కుటుంబానికి న్యాయం చేసే విధంగా పనిచేస్తోందన్నారు. అధికారులు,ప్రజాప్రతినిధులు ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారని చెప్పారు.ప్రభుత్వం మహిళా సంఘాల సభ్యులకు రెండు రంగుల్లో ప్రత్యేక చీరలను పంపిణీ చేస్తోందని, సంగారెడ్డి పట్టణంలో సుమారు 29 వేల మంది మహిళలకు చీరలు అందించనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కూన వనిత, కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, టీఎంసీ విజయభారతి, కౌన్సిలర్లు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి