తల్లిదండ్రులను పట్టించుకోని తనయులు మానవతతో అండగా నిలిచిన కలెక్టర్ అనురాగ్ జయంతి
తల్లిదండ్రులను పట్టించుకోని తనయులు మానవతతో అండగా నిలిచిన కలెక్టర్ అనురాగ్ జయంతి
స్థానికం బృందం
యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమం హృదయాన్ని కదిలించే ఘటనకు వేదికైంది. ఇటీవల జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన అనురాగ్ జయంతి ఓ వృద్ధ దంపతుల జీవితంలో ఆశాకిరణంగా నిలిచారు.
ఆలేరు మండలం కొలనుపాక గ్రామానికి చెందిన ధర్మ సోమిరెడ్డి–రమణమ్మ దంపతులు తమ ఇద్దరు కుమారులు ఆస్తి పంచుకుని తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తున్నారని అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో భువనగిరి ఆర్డీవో కృష్ణారెడ్డి గ్రామానికి వెళ్లి విచారణ చేపట్టి, కుమారులకు పలుమార్లు కౌన్సిలింగ్ నిర్వహించారు. సీనియర్ సిటిజన్ చట్టం–2007 ప్రకారం సబ్డివిజన్ ట్రైబ్యునల్ ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ, వారి వైఖరిలో మార్పు రాలేదు.
దిక్కుతోచని స్థితిలో ఉన్న వృద్ధ దంపతులు సోమవారం ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ను కలిసి మొరపెట్టుకున్నారు. “మాకు ఎవరూ లేరు… మాకు మీరే దిక్కు” అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వారి వేదనకు చలించిన కలెక్టర్ వెంటనే స్పందించి, చౌటుప్పల్ మండలం పెద్దకొండూరులోని వయోవృద్ధుల ఆశ్రమంలో చేర్పించి ఆశ్రయం కల్పించారు.
వృద్ధుల సమస్యలను నిర్లక్ష్యం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు కలెక్టర్ ఆదేశించారు. ఈ ఘటన జిల్లాలో తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే వారికి గట్టి హెచ్చరికగా మారింది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి