విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యత.. నీట్ పరీక్షలకు పోలీసుల ప్రత్యేక పర్యవేక్షణ
విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యత.. నీట్ పరీక్షలకు పోలీసుల ప్రత్యేక పర్యవేక్షణ
Krishna
ఆదివారం నిర్వహించనున్న నీట్-యూజీ 2026 పరీక్షలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు సంగారెడ్డి జిల్లా పోలీసు శాఖ విస్తృత భద్రతా ఏర్పాట్లు చేసింది. జిల్లా వ్యాప్తంగా ఉన్న 9 పరీక్షా కేంద్రాల్లో 2,924 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానుండగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీసీ కెమెరాల నిఘా, జామర్ల ఏర్పాటు, ప్రత్యేక పోలీసు బందోబస్తుతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి పలు పరీక్షా కేంద్రాలను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:15 గంటల వరకు జరగనుండగా, అభ్యర్థులను మధ్యాహ్నం 1:30 గంటల వరకు మాత్రమే కేంద్రాల్లోకి అనుమతిస్తారు. పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలులో ఉండటంతో పాటు జిరాక్స్, ఇంటర్నెట్ సెంటర్లను తాత్కాలికంగా మూసివేయనున్నారు. అభ్యర్థులు అడ్మిట్ కార్డు, గుర్తింపు కార్డుతో పాటు అవసరమైన పత్రాలు వెంట తీసుకురావాలని, మొబైల్ ఫోన్లు, స్మార్ట్ వాచీలు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు, నగలు తీసుకురావద్దని అధికారులు సూచించారు. విద్యార్థులు ఎలాంటి ఆందోళనకు గురికాకుండా నిబంధనలు పాటిస్తూ సమయానికి పరీక్షా కేంద్రాలకు చేరుకుని పరీక్షను విజయవంతంగా రాయాలని జిల్లా ఎస్పీ కోరారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి