భవిష్యత్తులో రోడ్డు విస్తరణకు అడ్డంకులు ఏర్పడే అవకాశం.
రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం నిదానపల్లి గ్రామంలో ఉన్న శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయానికి వెళ్లే బీటీ రహదారిపై ఆక్రమణల ముప్పు నెలకొంది. రహదారికి ఆనుకుని ఉన్న వ్యవసాయ భూమి యజమానులు పొలం మట్టిని భారీగా పోయడంతో రోడ్డు హద్దులు క్రమంగా కుదించుకుపోతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.
ఆలయానికి వెళ్లే ప్రధాన మార్గంలోనే మట్టిని రోడ్డు అంచుల వరకు పోయడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. వర్షాకాలంలో మట్టి రోడ్డుపైకి జారి ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నిదానపల్లి గుట్టపై ఉన్న శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయాన్ని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు భావిస్తున్న తరుణంలో రహదారి విస్తరణ అవసరం ఏర్పడే అవకాశముంది. అయితే ప్రస్తుతం రోడ్డు హద్దుల వరకు మట్టిని పోయడం వల్ల భవిష్యత్తులో రోడ్డు వెడల్పు పనులకు ఆటంకం కలిగే పరిస్థితి ఏర్పడుతుందని స్థానికులు చెబుతున్నారు.
ఇప్పటికైనా సంబంధిత రెవెన్యూ, పంచాయతీరాజ్ అధికారులు స్పందించి రహదారి హద్దులను పరిశీలించి, రోడ్డు భూమిపై ఉన్న మట్టిని తొలగించి ప్రజా ప్రయోజనాలను కాపాడాలని గ్రామస్తులు కోరుతున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి