నకిలీ పత్తి విత్తనాల ముఠా గుట్టురట్టు రూ.10 లక్షల విలువైన 150 కిలోల విత్తనాల స్వాధీనం
నకిలీ పత్తి విత్తనాల ముఠా గుట్టురట్టు రూ.10 లక్షల విలువైన 150 కిలోల విత్తనాల స్వాధీనం
Editor Desk
అంతర్రాష్ట్ర ముఠాపై తుర్కపల్లి పోలీసుల దాడి
తుర్కపల్లి: రైతులను మోసం చేసి అక్రమ లాభాలు ఆర్జించేందుకు నకిలీ పత్తి విత్తనాలను తెలంగాణలో విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను తుర్కపల్లి పోలీసులు భగ్నం చేశారు. రూ.10 లక్షల విలువైన 150 కిలోల నకిలీ బీజీ-2 పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకుని, ప్రధాన నిందితుడు దొండపాటి మల్లికార్జున రావును అరెస్టు చేశారు. మరో నిందితుడు శంకర్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
నమ్మదగిన సమాచారం మేరకు వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి తుర్కపల్లి బస్టాండ్ వద్ద తనిఖీలు నిర్వహించిన పోలీసులు, గుంటూరు నుంచి సిద్ధిపేటకు నకిలీ విత్తనాలను తరలిస్తున్న మల్లికార్జున రావును అదుపులోకి తీసుకున్నారు. విచారణలో రైతులకు అధిక దిగుబడులు వస్తాయని నమ్మించి నకిలీ విత్తనాలను విక్రయించేందుకు కుట్ర పన్నినట్లు వెల్లడైంది.
నిందితుడి వద్ద నుంచి “బిల్లా బీజీ-2 999” పేరుతో ఉన్న 70 కిలోల ప్యాకెట్ల విత్తనాలు, 80 కిలోల లూజ్ విత్తనాలు స్వాధీనం చేసుకున్నారు. విత్తనాల నిల్వ, రవాణా, విక్రయాలకు సంబంధించిన ఎలాంటి చట్టబద్ధ పత్రాలు లేకపోవడంతో కేసు నమోదు చేశారు.
రైతులకు హెచ్చరిక
నకిలీ విత్తనాల వల్ల మొలక శాతం తగ్గిపోవడం, పంటలు దెబ్బతినడం, రైతులు తీవ్ర ఆర్థిక నష్టాలు చవిచూడాల్సి వస్తుందని పోలీసులు హెచ్చరించారు. నకిలీ విత్తనాల తయారీ, రవాణా, విక్రయాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
యాదాద్రి భువనగిరి ఎస్పీ అక్షాంశ్ యాదవ్ పర్యవేక్షణలో ఈ ఆపరేషన్ నిర్వహించారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి