ప్రజా వినతుల పరిష్కారమే లక్ష్యం.. కార్యాచరణ ప్రణాళికపై అధికారులకు ఆదేశాలు
ప్రజా వినతుల పరిష్కారమే లక్ష్యం.. కార్యాచరణ ప్రణాళికపై అధికారులకు ఆదేశాలు
Krishna
సంగారెడ్డి జిల్లాలో ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమాల ద్వారా ప్రజల నుంచి వచ్చిన వినతులు, సమస్యలను సమగ్రంగా విశ్లేషించి వాటి పరిష్కారానికి జిల్లా స్థాయిలో స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని జిల్లాకు ప్రత్యేక అధికారిణిగా నియమితులైన ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డా. క్రిస్టినా జడ్ చోంగ్తు అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమాన్ని అన్ని శాఖలు సమన్వయంతో విజయవంతంగా అమలు చేసినందుకు జిల్లా యంత్రాంగాన్ని అభినందించారు. కార్యక్రమం సందర్భంగా ప్రజల నుంచి అందిన ఫిర్యాదులు, వినతులు, వాటి పరిష్కారానికి తీసుకున్న చర్యలు, సంక్షేమ పథకాల అమలు, ప్రజలకు అందిన ప్రయోజనాలపై సమీక్ష నిర్వహించారు. పెండింగ్లో ఉన్న సమస్యలను ప్రాధాన్యత ఆధారంగా గుర్తించి వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని, ప్రజల భాగస్వామ్యాన్ని పెంచిన మరియు మంచి ఫలితాలు ఇచ్చిన కార్యక్రమాలను భవిష్యత్తులో మరింత విస్తృతంగా అమలు చేయాలని సూచించారు. గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిలో పనిచేసిన అధికారుల నుంచి ఫీడ్బ్యాక్ సేకరించి, శాఖల సమన్వయంతో ప్రజా సమస్యల పరిష్కారానికి మరింత సమర్థవంతమైన కార్యాచరణ రూపొందించాలని తెలిపారు. జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ మాట్లాడుతూ, ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో గుర్తించిన సమస్యలను వర్గీకరించి వాటి పరిష్కారానికి చర్యలు చేపడుతున్నామని, మిగిలిన సమస్యలకు జిల్లా స్థాయి యాక్షన్ ప్లాన్ రూపొందించి ప్రజలకు మెరుగైన సేవలు అందించే దిశగా కృషి చేస్తున్నామని తెలిపారు. సమావేశంలో అడిషనల్ ఎస్పీ చైతన్య రెడ్డి, నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ ఉమాహారతి, వివిధ శాఖల జిల్లా అధికారులు, రెవెన్యూ డివిజనల్ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు,ఎంపీడీవోలు తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి