39వ సారి 'నరం' విప్పిన వాస్తవ వాది కొండగుడుపుల ఉమేష్
39వ సారి 'నరం' విప్పిన వాస్తవ వాది కొండగుడుపుల ఉమేష్
Bandi Kiran Kumar
సమాజంలో అన్యాయాలపై, నిజాల కోసం ఎప్పుడూ తన 'కలం' విప్పే ఆ జర్నలిస్ట్... ఈసారి సమాజంలో రక్తం కొరతతో కొట్టుమిట్టాడుతున్న ప్రాణాలను కాపాడటానికి తన 'నరం' విప్పారు. నేటి సమాజంలో రక్తదానానికి మించిన దానం లేదని, మనం ఇచ్చే రక్తం మరొకరి కుటుంబంలో వెలుగులు నింపుతుందని నిరూపిస్తూ ప్రముఖ జర్నలిస్ట్, కవి కొండగడుపుల ఉమేష్ (వాస్తవ వాది) మంగళవారం హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రిలో ఒకరికి ప్రాణదాతగా నిలిచారు.సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల పరిధిలోని కొత్తగూడెం గ్రామానికి చెందిన చింతకుంట్ల మధు సతీమణి జానకి వైద్య చికిత్స కోసం అత్యవసరంగా రక్తం కావలసి రాగా, కొండగడుపుల ఉమేష్ మానవత్వంతో స్పందించి ముందుకు వచ్చారు. ఆయన నిమ్స్ ఆసుపత్రిలో తన 39వ రక్తదానాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. సమాజ హితం కోసం నిరంతరం తపించే ఉమేష్తో పాటు మానవత్వంతో స్పందించి జానకి భర్త చింతకుంట్ల మధు, ఇరుగు ప్రశాంత్, మరియు మల్లెపాక మధు కూడా రక్తదానం చేసి తమ ఉదారతను చాటుకున్నారు.
2013 నుండి అవిరాల ప్రస్థానం:
గత 2013వ సంవత్సరం నుండి ఉమేష్ ఈ రక్తదాన మహత్కార్యాన్ని ప్రారంభించారు. అప్పటినుండి నేటివరకు దాదాపు 13 సంవత్సరాలుగా ఎలాంటి విరామం లేకుండా నిరంతరాయంగా రక్తదానం చేస్తూ ఎందరో బాధితులకు ఊపిరిగా నిలిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సమాజంలో రక్తం కొరతతో ఏ ఒక్కరూ ప్రాణాలు కోల్పోకూడదనే లక్ష్యంతోనే తాను ఈ సుదీర్ఘ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నానని తెలిపారు. జనాన్ని మేల్కొలిపే దిశగా ఆయన రాసిన స్ఫూర్తిదాయక కవిత్వాన్ని ఈ సందర్భంగా సందేశంగా పంచుకున్నారు:
"నీ నరాల్లో ప్రవహించే రక్తమే జీవపు పిలుపు...చావుతో పోరాడే ప్రాణానికి నువ్విచ్చే గెలుపు
గుండెలో పుట్టిన కరుణే మానవత్వ రూపం...ఈ దానంతో వెలిగే మరొకరి జీవిత దీపం!
ధనమిస్తే తీరుతుంది అవసరం కొంతకాలం...రక్తమిస్తే నిలుస్తుంది ఒక జీవితం చిరకాలం!
భయాన్ని వీడి ముందుకు వేయి ధైర్య అడుగు...ప్రేమతో, సేవతో నింపివేయి బ్రతుకు వెలుగు!
ప్రాణదాతవై నిలిచిపో లోకంలో శాశ్వతంగా!"
చాలామంది రక్తదానం చేయడానికి అనవసరమైన భయాలు పెట్టుకుంటారని, కానీ రక్తదానం వల్ల శరీరానికి ఎలాంటి నీరసం రాకపోగా, సరికొత్త రక్తం ఊరి ఆరోగ్యం మరింత మెరుగవుతుందని ఉమేష్ వివరించారు. ప్రమాదాల్లో, అత్యవసర వైద్య పరిస్థితుల్లో రక్తం దొరక్క ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారని, ఒకరి ప్రాణం పోయాక కన్నీళ్లు పెట్టడం కంటే, బ్రతికి ఉన్నప్పుడే రక్తాన్ని ఇచ్చి ప్రాణదాతలుగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు. యువత, సామాజిక కార్యకర్తలు బాధ్యతగా ముందుకు వచ్చి క్రమం తప్పకుండా రక్తదానం చేయాలని ఉమేష్ కోరారు.
ఈ కార్యక్రమంలో నిమ్స్ ఆసుపత్రి సిబ్బంది, రోగి బంధువులు పాల్గొని ఉమేష్ సామాజిక సేవా దృక్పథాన్ని, సమయస్ఫూర్తిని, మరియు ఆయనతో పాటు రక్తదానానికి ముందుకు వచ్చిన మిత్రులు చింతకుంట్ల మధు, ఇరుగు ప్రశాంత్, మల్లెపాక మధులను ఘనంగా అభినందించారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి