Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: March 07, 2026 04:40 AM

తక్కువ ధరకు భూమి అంటూ మోసం – ముందుగా రికార్డులు పరిశీలించండి: కంగ్టి సీఐ వెంకట్ రెడ్డి

తక్కువ ధరకు భూమి అంటూ మోసం – ముందుగా రికార్డులు పరిశీలించండి: కంగ్టి సీఐ వెంకట్ రెడ్డి

తక్కువ ధరకు భూమి అంటూ మోసం – ముందుగా రికార్డులు పరిశీలించండి: కంగ్టి సీఐ వెంకట్ రెడ్డి
March 06, 2026 08:14 PM 24 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sangareddy & Manoor
Sthanikam joint District Staff Reporter krishna

నారాయణఖేడ్ నియోజకవర్గం పరిధిలోని కంగ్టి సర్కిల్‌లో భూముల కొనుగోలు విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కంగ్టి సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకట్ రెడ్డి హెచ్చరించారు. శుక్రవారం కంగ్టి సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ ఈ విషయాలను వెల్లడించారు.కంగ్టి సర్కిల్ పరిధిలోని కంగ్టి, కల్హేర్, సిర్గాపూర్ మండలాల్లో భూములు కొనుగోలు చేసే సమయంలో కొంతమంది దళారులు కలిసి రైతులను మరియు కొనుగోలు దారులను మోసం చేస్తున్నట్లు పోలీసుల దృష్టికి వచ్చిందన్నారు. ముఖ్యంగా రైతుల పాస్‌బుక్‌లపై ఉన్న ఫోటోలను మార్ఫింగ్ చేసి, నకిలీ అగ్రిమెంట్లు చేసుకుంటూ భూముల వ్యవహారాల్లో మోసాలకు పాల్పడుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయని తెలిపారు.కొంతమంది దళారులు అసలు భూమి ఎక్కడో దూరంగా ఉండగా, రోడ్డుకు సమీపంలో ఉన్న మరో భూమిని చూపించి అదే భూమి అని చెప్పి కొనుగోలు దారులను నమ్మించి రిజిస్ట్రేషన్ చేయిస్తున్నారని చెప్పారు. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత అసలు విషయం తెలిసి కొనుగోలు దారులు మోసపోతున్నారని పేర్కొన్నారు.అలాగే మరికొందరు దళారులు “చాలా తక్కువ ధరకు మంచి భూమి వస్తుంది” అని చెప్పి మొదట కొనుగోలు దారుల నుండి 25 శాతం వరకు అడ్వాన్స్ తీసుకుని అగ్రిమెంట్ చేసుకుంటారని, కానీ రిజిస్ట్రేషన్ సమయం వచ్చేసరికి కనిపించకుండా పోయి మోసం చేస్తున్నారని తెలిపారు.ఈ నేపథ్యంలో భూమి కొనుగోలు చేయాలనుకునే వారు తప్పనిసరిగా ముందుగా ఆ భూమికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవాలని సూచించారు. గ్రామ స్థాయి ప్రజా ప్రతినిధులు, మండల మరియు డివిజన్ స్థాయి ప్రజా ప్రతినిధులు లేదా సంబంధిత అధికారులను సంప్రదించి భూమి యాజమాన్యం, సర్వే నంబర్లు, హక్కులు వంటి విషయాలను నిర్ధారించుకోవాలని తెలిపారు.అదేవిధంగా రెవెన్యూ రికార్డులు పరిశీలించడం, భూమి నిజమైన యజమాని ఎవరో నిర్ధారించడం, ప్రస్తుత మార్కెట్ రేట్ ఎంత ఉందో తెలుసుకోవడం వంటి విషయాలను జాగ్రత్తగా పరిశీలించిన తరువాత మాత్రమే భూమి కొనుగోలు చేయాలని ప్రజలకు సూచించారు.ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు లేదా దళారులు మోసం చేయడానికి ప్రయత్నించినట్లయితే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని కంగ్టి సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకట్ రెడ్డి ప్రజలకు సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉంటే ఇలాంటి మోసాలను నివారించవచ్చని ఆయన తెలిపారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News