శ్రీ రామలింగేశ్వర ఆలయంలో రామనవమి వేడుకలు
శ్రీ రామలింగేశ్వర ఆలయంలో రామనవమి వేడుకలు
Reporter Sangameshwar Reddy
సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండల కేంద్రంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో శ్రీ రామనవమి వేడుకలు ఘనంగా వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
ఈ వేడుకలలో భాగంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హారతులు నిర్వహించగా భక్తులు భక్తిశ్రద్ధలతో స్వామివారిని దర్శించుకుని ఆశీర్వాదాలు పొందారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయి ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. వేద పండితులు వేద మంత్రోచ్చారణలతో కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు.
కళ్యాణం సందర్భంగా ప్రత్యేకంగా పట్టు వస్త్రాలు తయారు చేయించి, స్థానిక హనుమాన్ మందిరం నుంచి శోభాయాత్రగా తీసుకువచ్చి శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం వరకు తీసుకెళ్లారు. ఈ శోభాయాత్రలో భక్తులు జై శ్రీరామ్ నినాదాలతో పాల్గొని ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని ప్రదర్శించారు.
అనంతరం ఆ పవిత్ర వస్త్రాలను శ్రీ సీతారాములకు శోభాయమానంగా ధరింపజేయనున్నారు. పచ్చల హారాన్ని రామయ్యకు అలంకరించగా, లక్ష్మణుడికి రామమాడను ధరింప చేస్తారు. చైత్ర శుద్ధ నవమి రోజు అభిజిత్ లగ్న ముహూర్తం రాగానే వేద మంత్రాల నడుమ శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు.
అలాగే శ్రీరాముని పుట్టిన తొట్టెలను ప్రత్యేకంగా ఏర్పాటు చేయగా, మహిళలు భక్తి గీతాలు పాడుతూ వేడుకలను మరింత ఆహ్లాదకరంగా తీర్చిదిద్దారు. ఆలయంలో భక్తి నిండిన వాతావరణం నెలకొంది.
అన్నదాన కార్యక్రమం నిర్వహించి భక్తులకు ప్రసాదాలను పంపిణీ చేశారు. ఈ వేడుకల్లో గ్రామంలోని ప్రజాప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు, సేవా సంఘాల ప్రతినిధులు పాల్గొని తమ వంతు సేవలను అందించారు.
ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం ఇలాంటి ధార్మిక కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించేందుకు కృషి చేస్తామని తెలిపారు. శ్రీ సీతారాముల దివ్య కృపతో సమస్త ప్రజలకు ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగాలని కోరుకున్నారు.
న్యాల్కల్ మండల్ స్థానిక రిపోర్టర్ సంగమేశ్వర్ రెడ్డి

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి