సమ్మె శాంతియుతంగా జరగాలి – ఎస్పీ హెచ్చరిక
సమ్మె శాంతియుతంగా జరగాలి – ఎస్పీ హెచ్చరిక
Krishna
జిల్లా పోలీసు కార్యాలయం, సంగారెడ్డి జిల్లా పత్రిక ప్రకటన తేదీ 22-04-2026: సంగారెడ్డి జిల్లాలో జరుగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీస్ శాఖ పటిష్ట భద్రతా చర్యలు చేపట్టింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ సమ్మెను పూర్తిగా శాంతియుతంగా నిర్వహించుకోవాలని కార్మికులకు సూచించారు. తమ సమస్యలను సంబంధిత ఉన్నతాధికారులకు తెలియజేయాలని, కానీ చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకూడదని స్పష్టం చేశారు. సమ్మె కారణంగా సాధారణ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నామని, ముఖ్యంగా విద్యార్థులు, ఉద్యోగులు మరియు అత్యవసర సేవలు వినియోగించే వారికి ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ మరియు రవాణా వ్యవస్థపై ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు. ప్రైవేట్ డ్రైవర్లు తాత్కాలికంగా విధుల్లోకి వచ్చినా లేదా ఆర్టీసీ డ్రైవర్లు తిరిగి విధుల్లో చేరినా వారికి పూర్తి భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు. బస్సులు నడపడానికి అర్హత కలిగిన డ్రైవర్లు ముందుకు రావాలని సూచిస్తూ, ఆసక్తి ఉన్న వారు జిల్లా పోలీసు కంట్రోల్ రూమ్ నంబర్ 8712656739కు సమాచారం ఇవ్వాలని కోరారు. ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఆస్తులకు నష్టం కలిగించడం, అధికారులపై దాడులు చేయడం వంటి చర్యలు కఠినంగా పరిగణించి చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బస్సులు మరియు ఇతర ప్రభుత్వ ఆస్తులపై దాడులు చేసి ప్రజలకు ఇబ్బందులు కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం, వదంతులు వ్యాప్తి చేసే వారిపై కూడా నిఘా కొనసాగుతోందని, అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. సమ్మెలో పాల్గొనే కార్మికులు మరియు ప్రజలు పరస్పర గౌరవంతో వ్యవహరించి ఎలాంటి ఉద్రిక్తతలకు తావు లేకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. జిల్లాలో శాంతి భద్రతలను కాపాడటంలో పోలీస్ శాఖకు ప్రజలు సహకరించాలని, ఎక్కడైనా అనుమానాస్పద పరిస్థితులు గమనించిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్కు లేదా కంట్రోల్ రూమ్కు సమాచారం అందించాలని ఎస్పీ కోరారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి