రూ.10,814 కోట్ల స్కాలర్షిప్స్, ఫీజు రీయింబర్స్మెంట్స్ విడుదల చేయాలని డిమాండ్.
బకాయిలు విడుదల చేయకుంటే కాంగ్రెస్ ప్రజాప్రతినిధులను రోడ్లపై తిరగనివ్వం: ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి టి.నాగరాజు
నల్గొండ, ఆగస్టు 13 (స్థానికం ప్రతినిధి):
రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్స్, ఫీజు రీయింబర్స్మెంట్స్ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో గురువారం నల్గొండ జిల్లా కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం నిర్వహించారు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు చేపట్టిన ఈ కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది విద్యార్థులు తరలివచ్చారు.
ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి టి.నాగరాజు మాట్లాడుతూ.. రాష్ట్రంలో రూ.10,814 కోట్ల స్కాలర్షిప్స్, ఫీజు రీయింబర్స్మెంట్స్ బకాయిలు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. పేద, మధ్యతరగతి విద్యార్థుల చదువులు స్కాలర్షిప్స్, ఫీజు రీయింబర్స్మెంట్స్పై ఆధారపడి ఉన్నాయని అన్నారు. ఏళ్ల తరబడి బకాయిలు విడుదల కాకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.
ఫీజులు చెల్లించకపోవడంతో కొన్ని ప్రైవేట్ విద్యాసంస్థలు విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నాయని ఆరోపించారు. ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని పెండింగ్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
విద్యార్థుల ఫీజులు చెల్లించేందుకు నిధులు లేవని ప్రభుత్వం చెబుతోందని, అదే సమయంలో ప్రచార కార్యక్రమాలు, ఎన్నికల సమయంలో పత్రికలు, టెలివిజన్లలో భారీగా ప్రకటనలు ఇచ్చేందుకు నిధులు ఎలా సమకూరుతున్నాయని నాగరాజు ప్రశ్నించారు. విద్యార్థుల విద్యకు నిధులు లేవని చెప్పడం ప్రభుత్వ ప్రాధాన్యతలను తెలియజేస్తోందని విమర్శించారు.
“విద్యార్థుల ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలి. లేకపోతే కాంగ్రెస్ ప్రజాప్రతినిధులను రాష్ట్రవ్యాప్తంగా రోడ్లపై తిరగనివ్వం. ప్రభుత్వం స్పందించే వరకు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం” అని నాగరాజు హెచ్చరించారు.
పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్స్, ఫీజు రీయింబర్స్మెంట్స్ను వెంటనే విడుదల చేసి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేసింది. ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున ఆందోళనలు చేపడతామని స్పష్టం చేసింది.
కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ఆకారపు నరేష్, జిల్లా కార్యదర్శి ఖమ్మంపాటి శంకర్, డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లం మహేష్, ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు సైదా నాయక్, బుడిగ వెంకటేష్, కోరే రమేష్, రవీందర్, కిరణ్, జగన్, ప్రణీత్, అదిల్, నవదీప్, ఝాన్సీ, లోహి, వర్షిత్, సాయి, హరీష్, చంటి, జయరాం, పరమేష్, వేణుచారి, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి