ఆగస్టు 15న అర్హులైన వికలాంగులందరికీ చేయూత మంజూరు చేయాలి
లేకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం: ఎన్పీఆర్డీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.అడివయ్య
భువనగిరి: ఆగస్టు 15న రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా మంజూరు చేయనున్న చేయూత పెన్షన్లలో వైకల్య ధ్రువీకరణ పత్రాలు పొందిన అర్హులైన వికలాంగులందరినీ చేర్చాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్పీఆర్డీ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.అడివయ్య డిమాండ్ చేశారు. అర్హులను విస్మరిస్తే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.
భువనగిరిలోని సుందరయ్య భవన్లో జిల్లా కోశాధికారి కె.లలిత అధ్యక్షతన జరిగిన సమావేశంలో వికలాంగుల సమస్యలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఈ సందర్భంగా అడివయ్య మాట్లాడుతూ.. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న అర్హులను పరిగణనలోకి తీసుకోకుండా మళ్లీ కొత్తగా దరఖాస్తులు స్వీకరించడం వల్ల లబ్ధిదారులకు ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు.
2023 డిసెంబర్లో 24.85 లక్షల మంది, 2026 మేలో 10.22 లక్షల మంది కొత్త చేయూత పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. ఇప్పటికే వైకల్య ధ్రువీకరణ పత్రాలు పొందిన వారందరికీ పెన్షన్లు ఇవ్వాలని కోరారు. కేవలం తలసేమియా, సికిల్సెల్, హిమోఫీలియా బాధితులకే కొత్తగా పెన్షన్లు మంజూరు చేయాలన్న నిర్ణయం మిగతా వికలాంగులకు అన్యాయం చేయడమేనని విమర్శించారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వికలాంగుల సంక్షేమాన్ని విస్మరిస్తున్నాయని ఆరోపించారు. వికలాంగుల హక్కుల చట్టం–2016తో పాటు ఇతర చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రం పెన్షన్ వాటాను రూ.300 నుంచి రూ.5 వేలకు పెంచాలని కోరారు.
చేయూత పెన్షన్లకు ఆదాయ పరిమితి విధించకుండా అర్హులైన వికలాంగులందరికీ షరతులు లేకుండా పెన్షన్లు మంజూరు చేయాలని అడివయ్య డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు బొల్లేపల్లి స్వామి, జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్, జిల్లా ఉపాధ్యక్షులు చిత్తలూరి శ్రీహరి, భగవంత్రెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు గోపి, రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి