రూ.11.51 లక్షల విలువైన 23.02 కిలోల గంజాయి స్వాధీనం
ఇద్దరు అంతర్రాష్ట్ర స్మగ్లర్ల అరెస్టు.. రెండు కార్లు, రెండు సెల్ఫోన్లు సీజ్
నాగోలు, ఆగస్టు 12 (స్థానికం ప్రతినిధి): ఒడిశా నుంచి హైదరాబాద్కు అక్రమంగా గంజాయి తరలిస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టును ఎస్ఓటీ ఎల్బీనగర్ జోన్, నాగోలు పోలీసులు రట్టు చేశారు. ఇద్దరు స్మగ్లర్లను అరెస్టు చేసి వారి నుంచి 23.02 కిలోల గంజాయి, రెండు కార్లు, రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు రూ.11.51 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు.
పోలీసుల కథనం ప్రకారం.. ఈ నెల 11న ఒడిశా నుంచి రెండు వాహనాల్లో గంజాయి తరలిస్తున్నారన్న పక్కా సమాచారంతో నాగోలు ఎక్స్రోడ్ సమీపంలోని భారత్ పెట్రోల్ బంక్ వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా వచ్చిన టయోటా ఇన్నోవా, మహీంద్రా ఎక్స్యూవీ300 వాహనాలను తనిఖీ చేయగా.. డిక్కీల్లో దాచిన ఆరు ప్యాకెట్లలో 23.02 కిలోల గంజాయి బయటపడింది.
అరెస్టయిన వారిని ఒడిశా రాష్ట్రం కోరాపుట్ జిల్లాకు చెందిన త్రినాథ్ నిరికె (40), సోనా హుంతల్ (28)గా గుర్తించారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే గంజాయి రవాణాకు పాల్పడినట్లు విచారణలో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు.
ఈ వ్యవహారంలో పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు కమ్ము కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. గంజాయి సరఫరా గొలుసులో ఉన్న ఇతర వ్యక్తులను గుర్తించేందుకు దర్యాప్తు కొనసాగుతున్నట్లు వెల్లడించారు.
మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ బి. సుమతి పర్యవేక్షణలో, ఎల్బీనగర్ జోన్ డీసీపీ బి. అనురాధ, ఎస్ఓటీ అధికారులు, నాగోలు పోలీసులు సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి