భువనగిరి: రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్లో ఉన్న రూ.10,800 కోట్ల స్కాలర్షిప్స్, ఫీజు రీయింబర్స్మెంట్స్ను వెంటనే విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వేముల నాగరాజు, లావుడియ రాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఫీజుల కోసం విద్యార్థుల సర్టిఫికెట్లు నిలిపివేస్తున్న ప్రైవేట్ కళాశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
గురువారం ఎస్ఎఫ్ఐ యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు వేముల నాగరాజు అధ్యక్షతన భువనగిరి కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. కలెక్టరేట్లోకి వెళ్లేందుకు విద్యార్థులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో కొద్దిసేపు తోపులాట జరిగింది.
ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి లావుడియ రాజు మాట్లాడుతూ.. గత ఆరు సంవత్సరాలుగా స్కాలర్షిప్స్, ఫీజు రీయింబర్స్మెంట్స్ బకాయిలు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో ఆ భారాన్ని విద్యార్థులు, తల్లిదండ్రులపై మోపడం సరికాదన్నారు. ఫీజులు చెల్లించలేదనే కారణంతో విద్యార్థుల ఒరిజినల్ సర్టిఫికెట్లు, టీసీలు, మెమోలు, ఇతర విద్యా పత్రాలను నిలిపివేసి వేధిస్తున్న కళాశాలలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
స్కాలర్షిప్తో సంబంధం లేకుండా విద్యార్థులకు సర్టిఫికెట్లు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, విద్యార్థుల నుంచి అక్రమంగా వసూలు చేసిన ఫీజులను తిరిగి ఇప్పించాలని కోరారు. పెండింగ్ నిధులు విడుదల కాకపోవడంతో పేద, మధ్యతరగతి విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడుతోందని అన్నారు.
స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్లు 7, 8, 9ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి విద్యా సంవత్సరం ప్రారంభంలోనే స్కాలర్షిప్స్, ఫీజు రీయింబర్స్మెంట్స్ విడుదలయ్యేలా శాశ్వత నిధుల వ్యవస్థను ఏర్పాటు చేయాలని కోరారు.
కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యురాలు ఇందూరాణి, జిల్లా ఉపాధ్యక్షులు ఈర్ల రాహుల్, ధారావత్ జగన్నాయక్, సహాయ కార్యదర్శి పుట్టల ఉదయ్, జిల్లా కమిటీ సభ్యులు నేహాల్, ప్రసన్న, నరేందర్, అరవింద్, నాయకులు మల్లేష్, సాయి, శరత్, మదన్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి