కలుషిత నీటితో నాగిరెడ్డిపల్లి ప్రజల అవస్థలు – అంటువ్యాధుల భయం.
నాగిరెడ్డిపల్లి, ఆగస్టు 17:
యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలోని నాగిరెడ్డిపల్లి గ్రామంలో మిషన్ భగీరథ పైప్లైన్ పగిలి సుమారు రెండు నెలలు గడుస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడంపై గ్రామ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పైప్లైన్ పగిలిన ప్రాంతం నుంచి బురద, మురుగునీరు కలిసే పరిస్థితి ఏర్పడి, అదే నీరు పైప్లైన్ ద్వారా ఇళ్లకు సరఫరా అవుతోందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
కలుషిత నీటిని తాగడం, వినియోగించడం వల్ల గ్రామంలో అంటువ్యాధులు, అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. సమస్యను పలుమార్లు సంబంధిత మండల అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటివరకు శాశ్వత పరిష్కారం చూపలేదని వాపోతున్నారు.
ఎవరి బాధ్యత?
సమస్యపై గ్రామ సెక్రటరీని సంప్రదించగా.. “ఇది మిషన్ భగీరథ పైప్లైన్.. దీనితో మాకు సంబంధం లేదు” అని చెబుతున్నారని గ్రామస్తులు పేర్కొంటున్నారు. మరోవైపు మిషన్ భగీరథ అధికారులు మాత్రం గ్రామపంచాయతీ పరిధిలోనే సమస్యను పరిష్కరించుకోవాలని చెబుతున్నారని ఆరోపిస్తున్నారు.
అధికారుల మధ్య బాధ్యతల నెట్టివేతతో రెండు నెలలుగా గ్రామ ప్రజలు కలుషిత నీటితో ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న ఈ సమస్యపై ఇకనైనా అధికారులు స్పందించాల్సిన అవసరం ఉంది.
ఎండీఓ, గ్రామ సెక్రటరీతో పాటు సంబంధిత మిషన్ భగీరథ అధికారులు వెంటనే నాగిరెడ్డిపల్లిలో పగిలిన పైప్లైన్ను పరిశీలించి, మరమ్మతులు చేపట్టి స్వచ్ఛమైన తాగునీరు అందించాలని గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. సమస్యను తక్షణమే పరిష్కరించకపోతే ప్రజల ఆరోగ్యానికి ఏదైనా ముప్పు వాటిల్లితే బాధ్యత ఎవరిది? అని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి