రాష్ట్ర బడ్జెట్ ప్రజలకు ఉపయోగం లేదంటూ సీపీఐ ఎంఎల్ లిబరేషన్ ర్యాలీ
రాష్ట్ర బడ్జెట్ ప్రజలకు ఉపయోగం లేదంటూ సీపీఐ ఎంఎల్ లిబరేషన్ ర్యాలీ
GADDAM JAGANMOHAN REDDY
నూజివీడు,
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం ముసునూరు మండలంలో సీపీఐ ఎంఎల్ లిబరేషన్ ఆధ్వర్యంలో ర్యాలీ, ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకుడు హరినాథ్ మాట్లాడుతూ రాష్ట్ర బడ్జెట్ ప్రజలకు ఏమాత్రం ఉపయోగకరంగా లేదని విమర్శించారు. ఊహాజనిత అంకెల గారడీతో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్గా మార్చుతున్నారని ఆరోపించారు.
పెండింగ్ ప్రాజెక్టులకు కేటాయింపులు మొక్కుబడిగా ఉన్నాయని, సూపర్ సిక్స్ హామీల్లో నిరుద్యోగ భృతి, ఆడపడుచులకు రూ.15,000 అంశాలపై ప్రస్తావన లేదన్నారు. జాతీయ ఉపాధి హామీ పథకానికి తగిన నిధులు కేటాయించకుండా నీరుగార్చారని విమర్శించారు.
భారత్–అమెరికా వాణిజ్య ఒప్పందాన్ని రద్దు చేయాలని, ఈ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధాని మోదీపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. మామిడి రైతులకు నష్టం వాటిల్లిందని, వారిని ఆదుకోవాలని కోరారు.
నూజివీడు నియోజకవర్గంలో పేదలు సాగు చేస్తున్న అటవీ భూములకు జారీ చేసిన ఫోర్ నోటిఫికేషన్ను రద్దు చేయాలని, జాతీయ ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమానికి వేముల బక్కయ్య నాయకత్వం వహించగా, జిల్లా కార్యదర్శి దుర్గం పుల్లారావు, జిల్లా కమిటీ సభ్యులు కలపాల వెంకటేశ్వరరావు, సర్వేసు భవాని, సీతామాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి