రామన్నపేట లో ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవం
రామన్నపేట లో ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవం
స్థానికం బృందం
రామన్నపేట, స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. భారతీయ శాస్త్రవేత్త C. V. రమణ రామన్ ఎఫెక్ట్ ఆవిష్కరణను పురస్కరించుకుని ప్రతి ఏటా ఫిబ్రవరి 28న ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు.
కార్యక్రమానికి ప్రిన్సిపల్ ఆచార్య రాహత్ ఖానం ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ సైన్స్ మన దైనందిన జీవితానికి ఆధారస్తంభమని పేర్కొన్నారు. శాస్త్రీయ పురోగతి వల్ల సమాజం అనేక రంగాల్లో ముందడుగు వేసిందని, విద్యార్థులు పరిశోధనాత్మక దృక్పథంతో ముందుకు సాగాలని సూచించారు.
భౌతిక శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విభాగాధిపతి డాక్టర్ జె. చిన్నబాబు మాట్లాడుతూ ఈ సంవత్సరం “వికసిత్ భారత్ దిశగా విజ్ఞాన శాస్త్రంలో మహిళలు” అనే ఇతివృత్తంతో సైన్స్ దినోత్సవాన్ని జరుపుతున్నట్లు తెలిపారు.
సైన్స్ దినోత్సవం సందర్భంగా ఉపన్యాస, చిత్ర ప్రదర్శన పోటీలు నిర్వహించారు. డాక్టర్ జి. సునీత, అనితలు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించగా, డాక్టర్ సి.హెచ్. వెంకటేశ్వర్లు వందన సమర్పణ చేశారు.
డాక్టర్ కృష్ణ కౌండిన్య, డాక్టర్ డి. కిషన్, డాక్టర్ రాచమల్ల శ్రీను, రవి, అమరేందర్, నరేష్ తదితర అధ్యాపకులు పాల్గొన్నారు. పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రిన్సిపల్ బహుమతులు ప్రదానం చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి