Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: February 27, 2026 10:37 PM

రాజేష్ కేసులో వాస్తవాలను దాచిపెడితే సహించం.. కుట్రలను బట్టబయలు చేస్తాం: మంద కృష్ణ మాదిగ

రాజేష్ కేసులో వాస్తవాలను దాచిపెడితే సహించం.. కుట్రలను బట్టబయలు చేస్తాం: మంద కృష్ణ మాదిగ

రాజేష్ కేసులో వాస్తవాలను దాచిపెడితే సహించం.. కుట్రలను బట్టబయలు చేస్తాం: మంద కృష్ణ మాదిగ
February 27, 2026 09:20 PM 1 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish HS

100 రోజుల తర్వాత రీ-పోస్టుమార్టం చేయడంపై ఎమ్మార్పీఎస్ అధినేత ఆగ్రహం

- నిందితులను కాపాడేందుకే పోలీసుల జాప్యం: బీబీనగర్ ఎయిమ్స్ పర్యవేక్షణలో శవపరీక్ష

కోదాడ పట్టణంలో 100 రోజుల క్రితం అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన (లాకప్ డెత్) కర్ల రాజేష్ మృతదేహానికి ఎట్టకేలకు రీ-పోస్టుమార్టం నిర్వహించడాన్ని ఎమ్మార్పీఎస్ పక్షాన స్వాగతిస్తున్నామని ఆ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ తెలిపారు. శుక్రవారం బీబీనగర్ ఎయిమ్స్ వైద్యుల బృందం ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రక్రియపై ఆయన స్పందిస్తూ, ప్రభుత్వం మరియు పోలీసు యంత్రాంగంపై విమర్శలు గుప్పించారు.

ఉద్దేశపూర్వక జాప్యంపై మండిపాటు:

"రాజేష్ మరణించిన మొదటి వారంలోనే రీ-పోస్టుమార్టం చేసి ఉంటే మృతికి గల కారణాలు స్పష్టంగా తెలిసేవి" అని మంద కృష్ణ పేర్కొన్నారు. కాలం గడిచేకొద్దీ మృతదేహం కుళ్ళిపోయి, ఒంటిపై ఉన్న గాయాలు కనపడకుండా పోతాయనే దురుద్దేశంతోనే పోలీసులు 100 రోజుల పాటు కాలయాపన చేశారని ఆరోపించారు. జాతీయ ఎస్సీ కమిషన్ రెండు నెలల క్రితమే ఆదేశాలు జారీ చేసినప్పటికీ, పోలీసు యంత్రాంగం వాటిని బేఖాతరు చేయడం వెనుక నిందితులను కాపాడే కుట్ర దాగి ఉందని ధ్వజమెత్తారు.

ఎస్సీ కమిషన్ నోటీసుల వల్లే కదలిక:

ఫిబ్రవరి 19న ఎస్సీ కమిషన్ మరలా నోటీసులు ఇవ్వడంతోనే ఇప్పుడు పోలీసులు హడావిడిగా రీ-పోస్టుమార్టం చేస్తున్నారని, మరి గత 90 రోజులుగా ఎందుకు మౌనంగా ఉన్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. "మా డిమాండ్లను, కమిషన్ ఆదేశాలను పట్టించుకోకుండా ఇన్నాళ్లూ జాప్యం చేయడం అంటే ఉద్దేశపూర్వకంగా నిందితులకు కొమ్ముకాయడమే" అని దుయ్యబట్టారు.

అధికారుల కుట్రలను బట్టబయలు చేస్తాం:

రీ-పోస్టుమార్టం నివేదికలో కేవలం వాస్తవాలు మాత్రమే ఉండాలని, న్యాయం గెలిచేలా రిపోర్టు ఉండాలని మంద కృష్ణ స్పష్టం చేశారు. "పై అధికారులు ఇప్పటికే ఈ కేసును తారుమారు చేసేందుకు కుట్రలకు తెరలేపారు. ఒకవేళ ఎవరైనా నివేదికను ప్రభావితం చేయాలని చూస్తే, అన్ని ఆధారాలతో సహా వారిని బట్టబయలు చేస్తాం" అని హెచ్చరించారు.

నివేదికపైనే అందరి దృష్టి:

బీబీనగర్ ఎయిమ్స్ ఫోరెన్సిక్ నిపుణులు డాక్టర్ ప్రగ్నేష్ పార్మర్ బృందం అందించే నివేదిక ఆధారంగా తమ తదుపరి కార్యాచరణ ఉంటుందని మంద కృష్ణ తెలిపారు. రాజేష్ కుటుంబానికి పూర్తిస్థాయి న్యాయం జరిగే వరకు, దోషులు కటకటాల వెనక్కి వెళ్లే వరకు ఎమ్మార్పీఎస్ పోరాటం ఆపబోదని స్పష్టం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News