రైతుల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది – మంత్రి దామోదర రాజనర్సింహ
రైతుల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది – మంత్రి దామోదర రాజనర్సింహ
Sthanikam joint District Staff Reporter krishna
రైతులు తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి సాధించి ఆర్థికంగా బలోపేతం కావాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. ముఖ్యంగా వ్యవసాయం మరియు ఉద్యాన రంగాల్లో ఆధునిక యంత్రాల వినియోగాన్ని పెంచడం ద్వారా రైతులకు పని భారాన్ని తగ్గించి, ఉత్పత్తి పెంచే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు.ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గురువారం సంగారెడ్డి కలెక్టరేట్ సముదాయ ఆవరణలో నిర్వహించిన కార్యక్రమంలో ఉద్యాన యాంత్రీకరణ పథకం ద్వారా రైతులకు చిన్న ట్రాక్టర్లను మంత్రి దామోదర రాజనర్సింహ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అర్హత కలిగిన ముగ్గురు ఎస్సీ, ఎస్టీ రైతులకు ఒక్కోటి సుమారు నాలుగు లక్షల తొంభై వేల రూపాయల విలువ గల ఇరవై గుర్రాల శక్తి సామర్థ్యం కలిగిన చిన్న ట్రాక్టర్లను అరవై శాతం సబ్సిడీతో అందజేశారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వ్యవసాయ రంగం అభివృద్ధి చెందాలంటే యాంత్రీకరణ ఎంతో అవసరమని తెలిపారు.ముఖ్యంగా చిన్న, సన్నకారు రైతులు ఆధునిక పద్ధతులు మరియు యంత్రాలను ఉపయోగించడంతో వ్యవసాయ ఖర్చులు తగ్గి, తక్కువ సమయంలో ఎక్కువ పని పూర్తి చేయగలుగుతారని చెప్పారు. దీంతో రైతులు ఎక్కువ దిగుబడి సాధించి ఆర్థికంగా బలోపేతం కావచ్చని పేర్కొన్నారు.రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని ముఖ్యంగా పరిగణిస్తూ పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. రైతులు కొత్త పద్ధతులను అలవాటు చేసుకుని సాగు విధానంలో మార్పులు తీసుకువస్తే వ్యవసాయ రంగం మరింత అభివృద్ధి చెందుతుందని తెలిపారు. రైతుల ఆర్థికాభివృద్ధి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, రైతులకు అవసరమైన సహాయం అందించడంలో ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందని మంత్రి స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్ చోంగ్తు, జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య, జిల్లా ఉద్యాన శాఖ అధికారి సోమేశ్వరరావు, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారి జ్యోతి, ఇతర జిల్లా అధికారులు, లబ్ధిదారులు మరియు రైతులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి