పూలే ఆశయాలతోనే సామాజిక మార్పు..
పూలే ఆశయాలతోనే సామాజిక మార్పు..
NM Yadav
ఘనంగా మహాత్ముని 200వ జయంతి ఉత్సవాలు..
విద్యాభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట.. కలెక్టర్ బి.చంద్రశేఖర్
క్లాక్ టవర్ వద్ద నివాళులర్పించిన ప్రముఖులు..
నల్లగొండ : సమానత్వం సామాజిక న్యాయం మరియు నాణ్యమైన విద్య కోసం పోరాడిన మహాత్మ జ్యోతిబాపూలే ఆశయాలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. శనివారం జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నల్లగొండ క్లాక్ టవర్ వద్ద నిర్వహించిన పూలే ‘ద్విశతాబ్ది’ జయంతి వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభలో కలెక్టర్ మాట్లాడుతూ.. వెనుకబడిన వర్గాల విద్యార్థుల కోసం ప్రభుత్వం ప్రీ-మెట్రిక్, పోస్ట్-మెట్రిక్ స్కాలర్షిప్లతో పాటు నాణ్యమైన విద్యను అందిస్తోందన్నారు. విద్యా విప్లవంలో భాగంగా ప్రతి నియోజకవర్గానికి ఒకటి చొప్పున రూ. 200 కోట్ల వ్యయంతో ‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్’ పాఠశాలలను నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. వీటిలో ఒక్కో పాఠశాలలో 2,600 మంది విద్యార్థులు చదువుకోవచ్చని, అలాగే ప్రతి నియోజకవర్గానికి ఒక మోడల్ స్కూల్ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. జిల్లాలో ఓవర్సీస్ విద్యానిధి కింద 12 మందికి కులాంతర వివాహాల పథకం కింద 21 మందికి ఆర్థిక సాయం అందించామన్నారు. విద్యార్థులు ‘ప్రశ్నించే మనస్తత్వాన్ని’ అలవాటు చేసుకోవాలని ఆయన ఆకాంక్షించారు.
నల్లగొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. పూలే కేవలం సంఘసంస్కర్త మాత్రమే కాదని, దేశంలో మహిళా విద్య కోసం పునాదులు వేసిన మహనీయుడని కొనియాడారు. ఎమ్మెల్సీ నెలకుంటి సత్యం మాట్లాడుతూ.. 200 ఏళ్ల క్రితమే కుల వివక్షకు వ్యతిరేకంగా పూలే పోరాటం చేశారని, నేటికీ కొనసాగుతున్న కుల వ్యవస్థ నిర్మూలనకు ఆయన ఆదర్శమని పేర్కొన్నారు. విద్యా రంగానికి ప్రభుత్వం మరిన్ని నిధులు కేటాయించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా క్లాక్ టవర్ చౌరస్తా నుంచి కలెక్టర్ ఆధ్వర్యంలో ‘నో డ్రగ్స్ క్యాంపెయిన్’ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ నెలికంటి సత్యం, మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి , డిప్యూటీ మేయర్ అమీర్ అలీ, విశ్రాంత ఐఏఎస్ చోల్లేటి ప్రభాకర్, అదనపు కలెక్టర్ వై. అశోక్ రెడ్డి, ఏఎస్పీ రమేష్, బీసీ సంక్షేమ శాఖ అధికారి సంజీవ మరియు వివిధ బీసీ సంఘాల ప్రతినిధులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి