నాగోల్, ఆగస్టు 7: హైదరాబాద్ నగరంలో వరుస చైన్ స్నాచింగ్లు, వాహన చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు అంతర్రాష్ట్ర నేరస్థులను నాగోల్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రెండు బంగారు మంగళసూత్రాలు, ఒక బజాజ్ పల్సర్ మోటార్సైకిల్, నేరాలకు ఉపయోగించిన ఓపో మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీహార్ రాష్ట్రంలోని సమస్తిపూర్ జిల్లాకు చెందిన అంషు కుమార్ (26), సరోజ్ కుమార్ (23), విక్రమ్ కుమార్ (23) ఇటీవల కూలీ పనుల నిమిత్తం హైదరాబాద్కు వచ్చి యాకుత్పురాలో నివాసముంటున్నారు. త్వరగా డబ్బు సంపాదించాలనే ఆశతో చైన్ స్నాచింగ్లు, వాహన చోరీలకు పాల్పడాలని కుట్ర పన్నారు.
ఈ నేపథ్యంలో ఆగస్టు 3న మేడ్చల్లోని వెల్లమ్మతోట కాలనీ నుంచి బజాజ్ పల్సర్ మోటార్సైకిల్ను చోరీ చేశారు. అనంతరం అదే బైక్పై ఆగస్టు 4న నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తట్టి అన్నారం ఆర్.కే.నగర్లో ఓ మహిళ మెడలోని బంగారు మంగళసూత్రాన్ని లాక్కెళ్లారు. అలాగే ఆగస్టు 6న యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ఎల్లంబావి గ్రామంలో మరో మహిళ మెడలోని ఐదు తులాల బంగారు మంగళసూత్రాన్ని అపహరించారు.
ఆగస్టు 7న ఆనంద్నగర్ ఎక్స్రోడ్డు వద్ద వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న నాగోల్ పోలీసులు అనుమానాస్పదంగా సంచరిస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారించగా, పై నేరాలకు పాల్పడినట్లు ఒప్పుకున్నారు. దీంతో కేసులను ఛేదించిన పోలీసులు వారి వద్ద నుంచి రెండు బంగారు మంగళసూత్రాలు (మొత్తం ఐదు తులాలు), బజాజ్ పల్సర్ మోటార్సైకిల్, ఓపో మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు.
కేసును చాకచక్యంగా ఛేదించి నిందితులను అరెస్ట్ చేసిన సీసీఎస్ ఎల్బీ నగర్ ఇన్స్పెక్టర్ గోవింద్, సరూర్నగర్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ శేఖర్, నాగోల్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ మహమ్మద్ మక్బూల్ జానీతో పాటు సిబ్బంది సుభాష్, సాయి, లింగస్వామి, జగన్లను ఎల్బీ నగర్ డీసీపీ డా. అనురాధ, ఐపీఎస్ ప్రత్యేకంగా అభినందించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి