జాతీయ పీఆర్ విద్యా దినోత్సవ వేడుకల్లో మంత్రి డా. గడ్డం వివేక్ వెంకటస్వామి
హైదరాబాద్, ఆగస్టు 6 (స్థానిక ప్రతినిధి):
ప్రజాసంబంధాల రంగం విశ్వాసం, నిజాయితీ, పారదర్శకత అనే విలువలను కాపాడుకుంటూనే కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికతను సమర్థవంతంగా వినియోగించుకోవాలని తెలంగాణ కార్మిక, ఉపాధి, శిక్షణ, గనుల శాఖ మంత్రి డా. గడ్డం వివేక్ వెంకటస్వామి పిలుపునిచ్చారు. సీవీఎన్ పీఆర్ ఫౌండేషన్, పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా (PRSI) హైదరాబాద్ చాప్టర్ సంయుక్తంగా నిర్వహించిన 19వ జాతీయ పీఆర్ విద్యా దినోత్సవం వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. పీఆర్ రంగ పితామహుడు డా. సి.వి. నరసింహారెడ్డికి ఘన నివాళులు అర్పించిన మంత్రి, ప్రజాసంబంధాల నిపుణులు ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు విశ్వసనీయంగా చేరవేయడంలో కీలక పాత్ర పోషించాలని సూచించారు. ప్రజలకు సమాచారం మరింత సమర్థవంతంగా అందేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రజాసంబంధాల వ్యవస్థను బలోపేతం చేస్తోందని వెల్లడించారు. కీనోట్ స్పీకర్ డా. శ్రీరామ్ బిరుదవోలు మాట్లాడుతూ.. ఏఐ, ఆటోమేషన్, డిజిటల్ టెక్నాలజీల వేగవంతమైన విస్తరణ నేపథ్యంలో డీప్ఫేక్లు, ఫేక్ న్యూస్, తప్పుడు సమాచారాన్ని సమర్థంగా ఎదుర్కొని ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించడంలో పీఆర్ నిపుణుల బాధ్యత మరింత పెరిగిందన్నారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రజాసంబంధాల రంగంలో విశిష్ట సేవలందించిన పలువురికి జాతీయ అవార్డులు ప్రదానం చేశారు. పీఆర్ నిపుణులు, అధ్యాపకులు, విద్యార్థులు, మీడియా ప్రతినిధులు సహా సుమారు 150 మంది కార్యక్రమంలో పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి