నాగోల్ పరిధిలో ఘటన.. ఆత్మహత్యా? లేక ప్రమాదమా? అనే కోణంలో దర్యాప్తు
చైతన్యపురి: నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మూసీనదిలో గుర్తుతెలియని యువకుడి మృతదేహం లభ్యమవడం స్థానికంగా కలకలం రేపింది. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ ఎల్బీనగర్ జోన్, నాగోల్ సర్కిల్ పరిధిలోని గౌరెల్లి–ప్రతాప్ సింగారం మూసీ వంతెన సమీపంలో ఓ వ్యక్తి మృతదేహం నీటిలో తేలియాడుతుండటాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న నాగోల్ పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని మూసీ నది నుంచి వెలికితీశారు. మృతుడు సుమారు 18 నుంచి 20 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన యువకుడిగా ప్రాథమికంగా గుర్తించారు. అతడు నీలిరంగు జీన్స్ ప్యాంట్, గోధుమరంగు షర్ట్ ధరించి ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
ఈ ఘటన ఆత్మహత్యా? లేక మూసీ ప్రవాహంలో కొట్టుకువచ్చాడా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుడి పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదని, గుర్తింపు కోసం ప్రయత్నాలు కొనసాగుతున్నాయని సెక్టార్ ఎస్ఐ రమేష్ తెలిపారు.
మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి