పెన్షన్ కోసం వెళ్లి ప్రాణాలతో పోరాటం..!
పెన్షన్ కోసం వెళ్లి ప్రాణాలతో పోరాటం..!
Komidala Mahender reddy
వృద్ధురాలిని ఢీకొట్టిన గుర్తుతెలియని వాహనం.. కేసు నమోదు కాలేదంటూ కుమారుడి ఆవేదన.
పెన్షన్ తీసుకునేందుకు వెళ్లిన ఓ వృద్ధురాలు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతుండగా, ఇప్పటివరకు కేసు నమోదు కాకపోవడం ఆందోళన కలిగిస్తోంది. నల్గొండ జిల్లా చిట్యాల పట్టణానికి చెందిన మంతెన అనసూయ అనే వృద్ధురాలు వారం రోజుల క్రితం పెన్షన్ పనిమీద బస్టాండ్ ఎదురుగా రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో ఆమెకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె నల్గొండ గొల్లగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు కేసు నమోదు చేయలేదని బాధితురాలి కుమారుడు మంతెన శ్రీహరి ఆవేదన వ్యక్తం చేశాడు. కేసు నమోదు చేయాలంటే ప్రమాదానికి కారణమైన కారు నంబర్ తీసుకురావాలని పోలీసులు చెబుతున్నారని, ప్రమాద సమయంలో అక్కడ లేని తనకు వాహనం నంబర్ ఎలా తెలుస్తుందని ప్రశ్నించాడు.
తన తల్లి ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా న్యాయం కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోందని కన్నీటి పర్యంతమయ్యాడు. ప్రమాద ఘటనపై పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి, సీసీ కెమెరాల ఆధారంగా నిందిత వాహనాన్ని గుర్తించి చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు, స్థానికులు కోరుతున్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి